కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటిషన్ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రెటీలకు ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న చెల్లిస్తానని ధనుష్ సమాధానమిచ్చారు.
కాగా, ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే కోర్టు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా తన ఫారెన్ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ, హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు.
