ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సరైన ఆధారాలు లేవని మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. 2000లో ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. కనీసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్ మాత్రం లబ్ది పొందారని కాలియప్పన్ మద్రాస్ హైకోర్ట్ లో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికిగానూ ఆయన నష్టపరిహారంగా 3 కోట్లు చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసుని న్యాయమూర్తి ఆర్ సుబ్రమణియం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకి ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు లాయర్ పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకి ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి వివరించారు. అయితే దీనిపై పిటిషన్ తరఫు న్యాయవాది సరైన వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసుని కొట్టేశారు.