Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు

Twisha Sharma

Twisha Sharma

మాజీ మిస్ పుణె ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ట్విషా భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉండటంతో కేసు ఉత్కంఠ రేపుతోంది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతను దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ముందస్తుగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సమర్థ్ ఆచూకీ కనిపెట్టేందుకు ఏకంగా ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటు అనుమానం ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా జల్లెడ పడుతున్నాయి.

ఇదే సమయంలో, సమర్థ్ సింగ్ ఎక్కడున్నాడో కచ్చితమైన సమాచారం ఇచ్చి, అతని ఆచూకీ చెప్పిన వారికి రివార్డ్ ఇస్తామని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సమర్థ్ సింగ్.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే, అతనికి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమర్థ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు, ట్విషా శర్మ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ మరణం కాదని, అత్తింటివారే పథకం ప్రకారం తమ కూతురిని దారుణంగా చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు ట్విషాను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసుల రాడార్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ్ ఆచూకీ దొరికితే.. ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.