Drishyam 4: ఇండియన్ సినీ ప్రేక్షకులను తన సస్పెన్స్, థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్లో నాలుగో భాగం ‘దృశ్యం 4’ తెరకెక్కనున్నట్లు నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ జార్జ్కుట్టిగా కనిపించనున్నారని స్పష్టమైంది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘దృశ్యం 3’ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్కుట్టి వేసే ఎత్తుగడలు, పోలీసులకు చిక్కకుండా అతడు చేసే ప్రయత్నాలు ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక నాలుగో భాగానికి కూడా డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ‘దృశ్యం 4’పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి జార్జ్కుట్టి ఎలాంటి కొత్త సమస్యను ఎదుర్కోబోతున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచించనున్నాడు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. త్వరలోనే నటీనటులు, కథ, షూటింగ్ తదితర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా ‘దృశ్యం 4’ ప్రకటనతో జార్జ్కుట్టి అభిమానుల్లో అప్పుడే సందడి మొదలైంది.
దృశ్యం 3 కథ:
తన కుటుంబం ఇబ్బంది పడకూడదని భావించి, వరుణ్ హత్య కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేసిన జార్జ్కుట్టి (మోహన్ లాల్), ఆ బయటపడటం కోసం ఏకంగా ఒక సినీ రచయితతోనే ప్లాన్ చేయించి ఒక కథ సిద్ధం చేయిస్తాడు. అయితే ఎలాగో డబ్బు ఖర్చు పెట్టి కథ సిద్ధం చేయించాం కదా అనే ఉద్దేశంతో, ఆ సినిమాను స్వయంగా తనే నిర్మాతగా మారి నిర్మిస్తాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అతని దశ తిరిగిపోతుంది. తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే, వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒక కారణంతో తప్పిపోతూ ఉంటుంది. అయితే తన కుమార్తె సంబంధాలను కావాలని ఎవరో చెడగొడుతున్నారనే విషయం తెలుసుకున్న జార్జ్, వారు ఎవరో కనిపెట్టే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు జార్జ్ దృష్టికి వస్తాయి. మరి జార్జ్ అనుకున్నట్టుగానే తన కుమార్తె పెళ్లి చేశాడా? కుమారుణ్ణి పోగొట్టుకున్న గీతా ప్రభాకర్, ప్రభాకర్ దంపతులు మళ్లీ జార్జ్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారా? తమ కుమారుడి హత్యకు పగ తీర్చుకున్నారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇది దృశ్యం 3 కథ. తాజాగా ప్రకటించిన దృశ్యం 4 కథ ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

