రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ.. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలు మాత్రం తగ్గడం లేదు. సినిమాలో ఆమెను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సన, తాజాగా ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ రూట్ మార్చారు. ఈ వివాదంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ వివరణ ఇస్తూ, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, సినిమాలోని వివాదాస్పద సీన్లపై ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా బుచ్చిబాబు స్పందిస్తూ… “ఒక దర్శకుడిగా సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి, ప్రేరేపించడానికి, వారితో మమేకం కావడానికేనని నేను బలంగా నమ్ముతాను. అంతే తప్ప, అది ఎవరినీ ఇబ్బంది పెట్టేలా లేదా గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న ఫీడ్బ్యాక్ను మేము గమనించాం, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం” అని పేర్కొన్నారు.
ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా తనకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందన్న బుచ్చిబాబు, ఏ ఆడపిల్లను తక్కువ చేసి చూపించాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. “ఏ మహిళా పాత్రను తప్పుగా లేదా గౌరవహీనంగా చూపించాలనే ఆలోచన మాకు అస్సలు లేదు. అయినప్పటికీ, సినిమాలో ఏదైనా భాగం మిమ్మల్ని బాధించి ఉంటే.. ఆయా వర్గాల భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాం. మీ ఆందోళనలను అర్థం చేసుకుని, దీనికి సంబంధించి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అని బుచ్చిబాబు రాసుకొచ్చారు.
ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేలా బుచ్చిబాబు ఒక కీలక నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ను పూర్తిగా సమీక్షించిన తర్వాత, సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సదరు సన్నివేశాలను మార్చాలని (ట్రిమ్ లేదా ఎడిట్ చేయాలని) నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
కథలు చెప్పే దర్శకులుగా మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలను, వారి సెంటిమెంట్లను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ఆయన.. ప్రతి మహిళ గౌరవించబడాలని, స్క్రీన్పై వారి పాత్రలు మర్యాదపూర్వకంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో స్ట్రాంగ్ క్యారెక్టర్లతో కూడిన సినిమాలను తీస్తామని ప్రామిస్ చేస్తూ, నిజాయితీగా తమ అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా వెనక్కి తగ్గి, సీన్లు తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం ఇప్పటికైనా సర్దుమణుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

