Dhanush: భాషలకు అతీతంగా తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరో ధనుష్. ఈ నెల 30న ఈ హీరో కొత్త సినిమా కర విడుదల కాబోతుంది. తాజాగా ఈ స్టార్ హీరో భారీ బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన ధనుష్, ఇప్పుడు హిందీ చిత్రసీమలో తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రూపొందుతున్న ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్లో ధనుష్ కథానాయకుడిగా నటించబోతున్నారట.
నిజానికి ఈ సినిమా గురించి వినిపిస్తున్న చాలా ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. మొదట మేకర్స్ ఈ రోల్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల చివరికి ఈ రోల్ ధనుష్ను వరించిందంట. ధనుష్ ఈ ప్రాజెక్ట్లో భాగం కావడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంలో ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘సర్దార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వాస్తవానికి భన్సాలీ నిర్మాణంలో ‘రౌడీ రాథోడ్ 2’ సినిమాను మిత్రన్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడటంతో, వీరిద్దరి కాంబినేషన్లో ఈ సరికొత్త ‘మైథలాజికల్ జంగిల్ డ్రామా’ సెట్స్ పైకి వెళ్తోందని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పటికే ‘రాంజనా’, ‘అత్రంగి రే’ వంటి సినిమాలతో మెప్పించిన ధనుష్కు, ఈ భన్సాలీ ప్రాజెక్ట్ హిందీలో అతిపెద్ద ప్రాజెక్ట్ కానుంది. భన్సాలీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్టింగ్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను రిలీజ్ చేయలేదు.
