Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’

Adhika Masa Purnima

Adhika Masa Purnima

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతరను సృష్టిస్తోంది. మార్నింగ్ షోల నుంచే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ విజయం దగ్గరే ఉందంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

రామ్ చరణ్ నటన, సినిమా పట్ల తను చూపించిన అంకితభావాన్ని కొనియాడుతూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. “గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను దగ్గరుండి చూశాను. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ వెండితెరపై ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన అసలైన ప్రతిఫలమే ఈ రోజు ప్రేక్షకులు అందిస్తున్న ఈ అఖండ విజయం. చరణ్‌కు దక్కుతున్న ఈ అపారమైన ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది” అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన నటీనటులు – సాంకేతిక నిపుణులను చిరంజీవి పేరుపేరునా అభినందించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్, కీలక పాత్రలు పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ గారికి, అలాగే జగపతిబాబును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇలాంటి ఒక అద్భుతమైన కథను రాసి.. అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

×
×
Ad