ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యాక్షన్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తున్న వేళ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఒక భారీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమైంది. సీనియర్ నటులు, టాలెంటెడ్ కమెడియన్ల కలయికలో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా వస్తున్న ‘ఆత్రేయపురం బ్రదర్స్’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. తాజాగా చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కు పక్కా ప్లానింగ్ చేసుకుంటోంది. ఒక సినిమాలో ఇద్దరు, ముగ్గురు కమెడియన్లు ఉంటేనే థియేటర్లలో నవ్వుల పూలు పూస్తాయి. అలాంటిది ఈ సినిమాలో రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, భద్రం, హరితేజ, దేవి ప్రసాద్.. ఇలా ఏకంగా ఒక భారీ కామిక్ ఆర్మీయే రంగంలోకి దిగింది. వీరితో పాటు శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇంతమంది హేమాహేమీలు ఒకే తెరపై కనిపిస్తుండటంతో ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది. రాజేష్ జగన్నాధం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫన్ రైడ్గా ఉండబోతోందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఈ భారీ మల్టీ-స్టారర్ కామెడీ ప్రాజెక్టును S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే టీజర్, సాంగ్స్ వంటి ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో సందడి చేయనుంది. సాంకేతికంగా ఈ చిత్రానికి రమీజ్ నవీత్ ఛాయాగ్రహణం (డీవోపీ) అందిస్తుండగా, సంతు ఓంకార్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ పసల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ తో పాటు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

