Anupam Kher: విజయాన్ని వాయిదా వేయొచ్చు.. కానీ ఓటమిని కాదు.. బెంగాల్ గెలుపుపై అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్!

Anupam Kher

Anupam Kher

Anupam Kher: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, కమలం వికసించిన వేళ.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏ రాజకీయ పార్టీ పేరు ఎత్తకుండానే ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యలు నేరుగా బెంగాల్ ఫలితాలను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అనుపమ్ ఖేర్ పోస్ట్‌లో ఏముందంటే..
సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన కొద్దిసేపటికే అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “సంకల్పం నిజమైతే, గమ్యం ఖాయం. విజయాన్ని వాయిదా వేయవచ్చు, కానీ దానిని ఓడించలేరు (ఓటమిని ఆపలేరు)” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో ఎక్కడా బీజేపీ లేదా పశ్చిమ బెంగాల్ ప్రస్తావన తీసుకురాలేదు. అయినప్పటికీ, బెంగాల్‌లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, తృణమూల్ కాంగ్రెస్ పతనం కావడాన్ని ఉద్దేశించే ఆయన ఈ మాటలు అన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “మీరు బెంగాల్ ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని మాకు స్పష్టంగా అర్థమైంది” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు “నిజమైన గెలుపుకు సమయం పట్టినా, అది రావడం ఖాయమని మీరు నిరూపించారు” అంటూ ఆయన పోస్ట్‌ను సమర్థిస్తున్నారు.

నిర్మొహమాటానికి మారుపేరు..
అనుపమ్ ఖేర్ సామాజిక, రాజకీయ అంశాలపై మొదటి నుంచి చాలా నిర్మొహమాటంగా స్పందిస్తుంటారు. జాతీయవాదం, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బెంగాల్ ఫలితాల వేళ ఆయన చేసిన ఈ ‘గూఢమైన’ పోస్ట్, పరోక్షంగా మమతా బెనర్జీ ఓటమిని, బీజేపీ విజయాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, అనుపమ్ ఖేర్ పోస్ట్ ఆ సంబరాలకు మరింత ఊపునిచ్చినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.