ఒకప్పుడు తన అద్భుత నటన, క్లాసికల్ డాన్స్తో భారతీయ వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) మళ్లీ కెమెరా ముందుకు రావాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు, భారతదేశానికి దూరమైన ఆమె.. దాదాపు మూడు దశాబ్దాల (30 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తన ‘కర్మభూమి’ అయిన ముంబైకి చేరుకున్నారు.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సరసన కె. విశ్వనాథ్ క్లాసిక్ ఫిల్మ్ ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu) లో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మీనాక్షి శేషాద్రి. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఆమె, తాజాగా మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్లో తన కుమారుడి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొంటున్న మీనాక్షి.. అక్కడ నుంచే ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ తన రీ-ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు.
‘నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. మీ ప్రేమ, నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేను మళ్లీ నా కర్మభూమి అయిన ముంబైకి తిరిగి వచ్చాను. ఎంతో నమ్మకం, ఉత్సాహం, పాజిటివిటీతో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెడుతున్నాను. నాకు కేవలం ప్రధాన పాత్రలే (Lead Roles) చేయాలని లేదు. అది లీడ్ రోల్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా లేదా చిన్న వెబ్ సిరీస్ అయినా నాకు ఓకే. కానీ ఆ పాత్ర కథలో ప్రాధాన్యత ఉన్నదై ఉండాలని, ఒక నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేలా ఉండాలి. నాకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ను మళ్లీ కొనసాగించడానికే నా ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణాన్ని నేనే చూసుకుంటున్నాను. ఎలాంటి పీఆర్ ఏజెన్సీ లేదా మేనేజర్ సాయం లేకుండా స్వయంగా నా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫర్లను మేనేజ్ చేసుకుంటున్నాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ, బలమైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నట్లు ఆమె హింట్ ఇచ్చారు.
