మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లోనే ఈ బిగ్ కాంబినేషన్ గురించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితేనే చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ షూటింగ్లో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెలతో ముందుకు వెళ్తారా లేదా అనేది ‘ప్యారడైజ్’ ఫలితాన్ని బట్టి తేలనుంది. ఒకవేళ ప్యారడైజ్ గనుక ఆశించిన స్థాయి విజయ సాధించకపోతే ఈ కాంబినేషన్ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి మైలురాయి లాంటి 100వ చిత్రంపై ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గతంలో పూరీ జగన్నాథ్ చెప్పిన ఒక కథలో సెకండాఫ్ నచ్చకపోవడం వల్లే చిరంజీవి ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ఎంచుకున్నారు. మరి ఇప్పుడు ‘కాకా’ తర్వాత చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఓదెలతో ఉంటుందా లేదా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇక నాని నటించిన ప్యారడైజ్ భారీ అంచనాల మధ్య ఈనెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

