Megastar Chiranjeevi : టాలీవుడ్లో కొన్ని రోజులుగా పెద్ద చర్చకు దారితీసిన “రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్” వివాదానికి చివరికి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో తెరపడింది. ఇండస్ట్రీకి ఎప్పుడైనా సమస్య వస్తే ముందుండి పరిష్కారం చూపించే వ్యక్తిగా పేరున్న చిరంజీవి.. మరోసారి అదే బాధ్యత తీసుకున్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పెరుగుతున్న విభేదాలు పెద్ద సంక్షోభంగా మారే ముందు స్వయంగా రంగంలోకి దిగారు.
కొద్ది రోజులుగా తెలంగాణలోని కొన్ని ఎగ్జిబిటర్ల సంఘాలు “రెంటల్ విధానం ఇక కొనసాగదు… పర్సెంటేజ్ విధానం తీసుకురావాలి” అంటూ ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ వివాదం కొనసాగితే రాబోయే పెద్ద సినిమాల విడుదలలపై ప్రభావం పడే అవకాశం కనిపించింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో థియేటర్ల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
అసలు ఈ “రెంటల్”, “పర్సెంటేజ్” వ్యవహారం ఏంటనే ప్రశ్న చాలామందిలో ఉంది. ప్రస్తుతం చాలా థియేటర్లు ఫిక్స్డ్ రెంటల్ విధానంలో నడుస్తున్నాయి. అంటే నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ ముందుగానే ఒక నిర్దిష్ట అద్దె మొత్తాన్ని థియేటర్కు చెల్లిస్తారు. సినిమా ఆడినా, ఆడకపోయినా థియేటర్కు ఆ రెంట్ వస్తుంది. కానీ ఎగ్జిబిటర్ల వాదన మాత్రం వేరుగా ఉంది. “ప్రస్తుతం ప్రేక్షకులు తగ్గిపోయారు… ఖర్చులు పెరిగాయి… కాబట్టి కలెక్షన్లలో వాటా రూపంలో పర్సెంటేజ్ సిస్టమ్ రావాలి” అనేది వారి డిమాండ్.
మరోవైపు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం “అలా ఒక్కసారిగా మార్పులు చేస్తే రిలీజ్ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపించడంతో… ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి రంగంలోకి దిగినట్టు సమాచారం.
హైదరాబాద్లోని తన నివాసంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ప్రతినిధులతో చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూడు వర్గాల అభిప్రాయాలు విన్న చిరంజీవి… తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం కనుగొనాలని సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా “ఇండస్ట్రీకి నష్టం కలగకుండా చూడాలి… ఒకరి వల్ల ఇంకొకరికి ఇబ్బంది రాకూడదు” అనే దిశగా చర్చ జరిగినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న “రెంటల్ విధానం”ను జూన్ 30 వరకు యథాతథంగా కొనసాగించేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్లు అంగీకరించారు. అదే సమయంలో… “పర్సెంటేజ్ విధానం”పై పూర్తి స్థాయి అధ్యయనం చేసి, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి చాంబర్ కమిటీ పని చేస్తుందని చిరంజీవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామంతో ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్రిక్తత కొంత వరకు తగ్గినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు నిర్మాతలు ఊపిరిపీల్చుకోగా… మరోవైపు ఎగ్జిబిటర్ల సమస్యలను కూడా పట్టించుకుంటామని భరోసా లభించింది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదలలకు ఆటంకం ఏర్పడకుండా ఈ తాత్కాలిక ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
టాలీవుడ్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చూపడంలో చిరంజీవి గతంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే బాధ్యతతో ముందుకొచ్చారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది “ఇండస్ట్రీ పెద్దగా మరోసారి బాధ్యత తీసుకున్నారు” అంటూ చిరంజీవిని ప్రశంసిస్తున్నారు.
అయితే అసలు పరీక్ష మాత్రం జూన్ 30 తర్వాతే ఉండబోతోంది. అప్పటివరకు చాంబర్ కమిటీ ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది? నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లందరికీ ఆమోదయోగ్యమైన మోడల్ సిద్ధమవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతానికి మాత్రం… టాలీవుడ్లో పెద్ద సంక్షోభంగా మారే పరిస్థితిని చిరంజీవి చొరవతో ఆపగలిగారని చెప్పాలి. ఇండస్ట్రీలో మూడు వర్గాలను ఒకే టేబుల్ మీదకు తీసుకురావడం… చర్చల ద్వారా పరిష్కారం దిశగా తీసుకెళ్లడం… ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
