Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్

Bhagyashri Borse (2)

Bhagyashri Borse (2)

Bhagyashri Borse: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, తన అందం, నటనతో ప్రేక్షకుల ఆకట్టుకన్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే తెలుగు ప్రేక్షకులకు రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కింగ్‌డమ్’, ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అందుకే పరాజయాలు ఎదురైనా దర్శక నిర్మాతలు ఆమెపై నమ్మకం కోల్పోలేదు.

ఇటీవల విడుదలైన ‘లెనిన్’ మాత్రం భాగ్యశ్రీ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ విజయంతో నిర్మాతల దృష్టి మరోసారి భాగ్యశ్రీపై పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉండగా, కొత్త ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘లెనిన్’ విడుదలకు ముందు భాగ్యశ్రీ ఒక్కో సినిమాకు సుమారు రూ.1.5 కోట్లు పారితోషికంగా తీసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. తాజా విజయంతో ఆమె తన రెమ్యునరేషన్‌ను దాదాపు రూ.3 కోట్లకు పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తగా వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కు ఇదే మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ‘సేయోన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ తమిళ చిత్రసీమలో కూడా అడుగుపెడుతున్నారు.  ఒక్క హిట్ నటుల కెరీర్‌ను ఎంత వేగంగా మార్చగలదో భాగ్యశ్రీ బోర్సే ప్రయాణం మరోసారి నిరూపిస్తోంది. వరుస పరాజయాలు ఎదురైనా అవకాశాలను వదులుకోకుండా ముందుకు సాగిన ఆమె, ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్‌తో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదిస్తోంది. ఇక రాబోయే సినిమాలు కూడా విజయవంతమైతే, భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.