భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు ఓ కీలకమైన తండ్రి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, “నేను రాసుకున్న ఈ కథను నా సొంత ఊరైన అనకాపల్లి నేపథ్యంలోనే తీయాలని నిర్ణయించుకున్నాను. అనకాపల్లిలోని దాదాపు 75 లొకేషన్లలో పూర్తిస్థాయిలో షూటింగ్ జరిపాం. ఊరి వాతావరణం, అక్కడి మనుషుల ఎమోషన్స్ చాలా నేచురల్గా వచ్చాయి. నిర్మాత కాండ్రేగుల నాయుడు మా ఊరిలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇండస్ట్రీకి వస్తానంటే మొదట్లో వద్దన్నా, అతని పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. దాదాపు ఈ సినిమాని నేనే దగ్గరుండి తీసినంతగా తీర్చిదిద్దాం” అని తెలిపారు.
“ప్రస్తుత జెన్ జీ (Gen Z) తరానికి కుటుంబ భావోద్వేగాలు, అనుబంధాల విలువలు సరిగ్గా తెలియడం లేదు. ఆ ఎమోషన్స్ను వారికి గుర్తుచేస్తూ ఒక మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ డ్రామాను రూపొందించాం. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నప్పటికీ, అంతర్లీనంగా ఉండే ఫ్యామిలీ డ్రామానే అందరినీ కట్టిపడేస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి, ఈ డ్రామా పాడవుతుందనే ఉద్దేశంతో ఎటువంటి కట్స్ విధించకుండా అభినందించడం మా నమ్మకాన్ని పెంచింది” అని త్రినాథరావు స్పష్టం చేశారు.

