శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత – నటులు మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ నటులు -నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు గారు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు గారు, శంకర్ రావు గారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. గతంలో తెలుగు సినిమా అంటే తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. “అమరావతికి ఆహ్వానం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
