Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్‌లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!

Adivi Sesh

Adivi Sesh

Adivi Sesh: కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఇప్పుడు ఆయన మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్, ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్తతో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న హిందీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, సెప్టెంబర్ నెలలో కాస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్, దర్శకుడి పేరు, నిర్మాణ సంస్థ వంటి కీలక వివరాలను మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

తెలుగులో  హీరోగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న అడివి శేష్, కథల ఎంపికలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మేజర్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అదే సినిమా అడివి శేష్‌కు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఇమేజ్‌తో ఆయన నేరుగా హిందీ చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల విడుదలైన ‘డాకాయిట్’ చిత్రంలో కూడా అడివి శేష్ భిన్నమైన పాత్రలో కనిపించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ద్వారా మరోసారి అడివి శేష్ తన నటనతో ఆకట్టుకున్నారు.  కథకు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా ఆయనకు ఉన్న పేరు, వరుస విజయాలు, పాన్ ఇండియా ఇమేజ్ ఈ కొత్త ప్రాజెక్ట్‌కు మరింత హైప్ తెచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ హిందీ యాక్షన్ డ్రామా గురించి మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారనేది వేచి చూడాలి.