Actress Rohini: సినిమా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి రోహిణి తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దివంగత నటుడు, తన మాజీ భర్త రఘువరన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోహిణి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉన్న టైంలోనే ఆమె నటుడు రఘువరన్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఆమె సుదీర్ఘ కాలం పాటు వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తను సినిమాలకు అంత కాలం దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.
తన సినీ కెరీర్ హఠాత్తుగా ఆగిపోవడానికి గల కారణాలను రోహిణి వివరిస్తూ… రఘువరన్ తనను కేవలం హౌస్వైఫ్గా మాత్రమే చూడాలనుకున్నారని, తన సినీ కెరీర్కు ఆయన నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్పష్టం చేశారు. “రఘువరన్ నన్ను పెళ్లి తర్వాత హౌస్వైఫ్గానే ఇంటికే పరిమితం కావాలని కోరుకున్నాడు. నా నటనపై గానీ, నా సినీ కెరీర్పై గానీ ఆయనకు ఆసక్తి లేదు. దానికి ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఆ మానసిక సంఘర్షణ వల్లే నేను ఏకంగా ఏడేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది” అని వెల్లడించారు. రఘువరన్ – రోహిణి 1996లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు (రిషివరన్) ఉన్నాడు. ఆ తర్వాత వీరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2008 లో రఘువరన్ మరణించారు. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో మెప్పించిన రోహిణి, పెళ్లి తర్వాత ఏడేళ్ల పాటు సినిమాలకు దూరం కావడం వెనుక ఉన్న అసలు నిజాన్ని పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

