Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?

Sooraj Pancholi (2)

Sooraj Pancholi (2)

Sooraj Pancholi: బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని జుహులో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసందే. 25 ఏళ్ల వయసులోనే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి ముందు రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా, నటుడు సూరజ్ పంచోలీతో ఉన్న ప్రేమ సంబంధంలో తలెత్తిన మానసిక వేదనలే దీనికి కారణమని విచారణలో తేలింది. ఈ కేసులో సూరజ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2023 ఏప్రిల్‌లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

అయితే ఇప్పటికీ తనపై అనుమానాలు వ్యక్తం చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం కావడం తనను తీవ్రంగా బాధిస్తున్నాయని సూరజ్ పంచోలీ సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. 2026 ఆగస్టు 2న (ఈరోజు) సూరజ్ పంచోలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన లేఖను పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం అవుతున్న అసత్య కథనాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు చట్టపరంగా పూర్తిగా ముగిసిపోయిందని, కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేస్తూ, ఇప్పటికీ పరిష్కారం కాని ప్రశ్నలు ఉన్నాయనేలా కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.

తన లేఖలో సూరజ్ మాట్లాడుతూ, వాస్తవాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ కోర్టు రికార్డులు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. సాక్ష్యాలు, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వచ్చిన తీర్పును పక్కన పెట్టి వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పులు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేసు తన జీవితంపై చూపిన ప్రభావాన్ని కూడా సూరజ్ ఎంతో భావోద్వేగంగా వివరించారు. ఈ ఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని, జియా ఖాన్‌తో తన పరిచయం కూడా నాలుగు నెలలకే పరిమితమైందని గుర్తుచేశారు. ఆమె వ్యక్తిగతంగా ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తనకు తెలియదని, ఆ వయసులో అంతటి క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకునే పరిపక్వత కూడా తనకు లేదని చెప్పారు.

అయితే ఆ ఘటన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని సూరజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా కెరీర్‌ను నిర్మించుకోవాల్సిన 20, 30 ఏళ్ల వయసులో ఎక్కువ భాగాన్ని కోర్టు కేసులు, విచారణలు, ఆరోపణల మధ్య గడపాల్సి వచ్చిందని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా 14 సంవత్సరాలు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి రోజు మానసికంగా ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నానో తనకే తెలుసని పేర్కొన్నారు. తాను న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో పోరాడానని, చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని సూరజ్ వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొందరు తనను దోషిగానే చూస్తూ తీర్పులు ఇస్తే, అలాంటి పరిస్థితిలో తాను ఇంకేం చేయగలనో అర్థం కావడం లేదని భావోద్వేగంగా రాశారు.

అదే సమయంలో జియా ఖాన్ గోప్యతను తాను ఎప్పటికీ గౌరవిస్తానని సూరజ్ స్పష్టం చేశారు. ఆమె పేరును ఆధారంగా చేసుకుని అసత్య కథనాలు, వక్రీకరించిన ప్రచారాలు చేయవద్దని ప్రజలను కోరారు. ఒక విషాద సంఘటనను సంచలనంగా మార్చకుండా, నిజాలను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు న్యాయపరంగా కేసు ముగిసిన తర్వాత కూడా సూరజ్ పంచోలి చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి.