Site icon NTV Telugu

తుది మెరుగుల్లో ‘1948 – అఖండ భారత్’!

ఈశ్వర్ బాబు దర్శకత్వంలో ఎం. వై. మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-అఖండ భారత్’. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ మూవీ పోస్టర్ ను, లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గాంధీగా రఘునందన్, నాథురాం గాడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు. అలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఈ సినిమా గురించి దర్శకుడు ఈశ్వర్ బాబు మాట్లాడుతూ,” గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియదు. గాడ్సే కోర్టులో తన చర్యలను సమర్థించుకుంటూ చేసిన వాదన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు రాకుండా నిషేధించింది! గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత… అతను కోర్ట్ లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా – దాన్ని కూడా ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు. అలా 70 సంవత్సరాల పాటు దాచిపెట్టిన నిజాలను పూర్తిగా… ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి… హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం” అని అన్నారు.

ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే తో పాటు నాథురాం గాడ్సేగా నటించిన ఆర్యవర్థన్ రాజ్ మాట్లాడుతూ, ”11, 372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి, 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 2200కి పైగా ప్రొపర్టీస్, 1670కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేశాం” అని అన్నారు. ‘గులాబీ’ ఫేమ్ శశిప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమాను జాతీయ, అంతర్జాతీయ భాషల్లో త్వరలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Exit mobile version