Paneer Bhurji Recipe: రోజూ పప్పు, అన్నం, బెండకాయ, సొరకాయ కూరలు తింటూ బోర్ కొడుతోందా..? అయితే, పిల్లల నుంచి పెద్దల వరకు పనీర్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. అలాంటి పనీర్తో కేవలం కొన్ని పదార్థాలు ఉపయోగించి అదిరిపోయే రుచితో భుర్జీ తయారు చేసుకోవచ్చు. కాస్త మసాలా, కాస్త క్రీమీ టచ్తో చేసే ఈ రెసిపీ ఒక్కసారి తింటే ఇంట్లో తరచూ చేయమని అడగాల్సిందే. కాస్త స్పైసీగా, రుచికరంగా, త్వరగా తయారయ్యే వంటకం కావాలంటే ఢాబా స్టైల్ పనీర్ భుర్జీ మంచి ఆప్షన్. దీనిని తయారు చేయడం చాలా సులభమే కాకుండా.. పనీర్లో ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, కసూరి మెంతి, మసాలాలతో తయారు చేసే ఈ పనీర్ భుర్జీని వేడి వేడి పరాటా, బటర్ నాన్, తవా రోటీ లేదా పూరీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పనీర్ భుర్జీ పొడిగా కాకుండా సాఫ్ట్గా, జ్యూసీగా, క్రీమీగా ఉండాలంటే ఇలా చెప్పినట్లు ఫాలో అవ్వండి చాలు..
కావాల్సిన పదార్థాలు:
* పనీర్ – 250 గ్రాములు.
* ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
* టమాటాలు – 2 (సన్నగా తరిగినవి)
* క్యాప్సికం – అర ముక్క (సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
* వెన్న లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
* నూనె – 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర – అర టీ స్పూన్
* పసుపు – అర టీ స్పూన్
* కారం – 1 టీ స్పూన్
* ధనియాల పొడి – 1 టీ స్పూన్
* గరం మసాలా – అర టీ స్పూన్
* పావ్ భాజీ మసాలా లేదా కిచెన్ కింగ్ మసాలా – అర టీ స్పూన్
* కసూరి మెంతి – 1 టీ స్పూన్
* తాజా క్రీమ్ లేదా పాలు – 2 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర – సన్నగా తరిగినది
* ఉప్పు – రుచికి సరిపడా..
తయారు చేసే విధానం:
ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, రెండు టేబుల్ స్పూన్ల వెన్న లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనెతో పాటు వెన్నను ఉపయోగించడం వల్ల వెన్న త్వరగా కాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి వచ్చిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికం, టమాటాలు వేసి కొద్దిగా ఉప్పు కలపాలి. కడాయిపై మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి. టమాటాలు మెత్తగా మారి, మిశ్రమం నుంచి నూనె కొద్దిగా బయటకు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి, పావ్ భాజీ మసాలా లేదా బిర్యానీ మసాలా వేసి సుమారు ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పాలు లేదా తాజా క్రీమ్ వేసి మసాలాలో బాగా కలపాలి. ఈ చిన్న చిట్కా వల్ల పనీర్ భుర్జీ పొడిగా కాకుండా క్రీమీగా, జ్యూసీగా ఉంటుంది.
తర్వాత తురిమిన పనీర్, అవసరమైనంత ఉప్పు వేసి మసాలాతో సున్నితంగా కలపాలి. పనీర్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలకు మించి ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికిస్తే పనీర్ గట్టిగా, రబ్బర్లా మారే అవకాశం ఉంటుంది. చివరగా గరం మసాలా, చేతితో నలిపిన కసూరి మెంతి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, సాఫ్ట్గా, క్రీమీగా ఉండే ఢాబా స్టైల్ “పనీర్ భుర్జీ” రెడీ. దీన్ని వేడివేడిగా పరాటా, రోటీ, నాన్ లేదా పూరీతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. రోజూ చేసే సాధారణ కూరలకు భిన్నంగా లంచ్ లేదా డిన్నర్లో ఈ పనీర్ భుర్జీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.

