Ragi Aratikaya Bajji: సాధారణంగా మనం శెనగపిండితో చేసే బజ్జీలను తింటూ ఉంటాము. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో కూడా ఎంతో రుచికరమైన బజ్జీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఈ స్టోరీలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి బజ్జీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 1 కప్పు (240 ml)
మైదా పిండి: 1/4 కప్పు
మిరప పొడి: 1 టీస్పూన్
వెల్లుల్లి: 3 రెబ్బలు (దంచినవి)
ఉప్పు: రుచికి సరిపడా
వంట సోడా (Baking Soda): 1/2 టీస్పూన్
నీళ్లు: తగినంత
అరటికాయ: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఒక గిన్నెలో రాగి పిండి, మైదా పిండి, మిరప పొడి, దంచిన వెల్లుల్లి, ఉప్పు – వంట సోడా వేసి బాగా కలపాలి. రాగి పిండి కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి, బజ్జీలు మెత్తగా రావడం కోసం వంట సోడా తప్పనిసరిగా వాడాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక పచ్చి అరటికాయను తీసుకుని దానిపై ఉన్న తొక్కను తీసేయాలి. ఆపై మీకు నచ్చిన పరిమాణంలో ముక్కలుగా కోసుకోవాలి. స్లైసర్తో కోస్తే ముక్కలు చాలా పల్చగా వస్తాయి, కాబట్టి కత్తితో కొంచెం మందంగా కోసుకుంటే బజ్జీలు రుచిగా ఉంటాయి.
స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత, కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను రాగి పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బజ్జీలు రెండు వైపులా బాగా కాలేలా తిప్పుకోవాలి. వంట సోడా వేసినందున బజ్జీలు బాగా ఉబ్బుతాయి. మంచి రంగు వచ్చిన తర్వాత నూనె నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. రాగి పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇది పిల్లలకు, పెద్దలకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్గా పని చేస్తుంది. శెనగపిండితో బోర్ కొట్టినప్పుడు ఈ ఆరోగ్యకరమైన రాగి బజ్జీలను ప్రయత్నించి చూడండి.
ప్రయోజనాలు ఇవే..
ధాన్యాలన్నింటిలోనూ రాగిలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. రాగిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, దీంతో అతిగా తినడం తగ్గి బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. రాగిలో ఉండే ‘పాలీఫెనాల్స్’ – ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్ లేదా మైదాతో పోలిస్తే రాగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఐరన్ లోపంతో బాధపడేవారికి రాగి గొప్ప వరం. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. రాగి ప్రకృతి సిద్ధంగానే శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే వేసవిలో రాగి జావ లేదా ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం వేడి తగ్గుతుంది.
