Ragi Vadiyalu: ఎండా కాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో రకరకాల వడియాల సందడి మొదలవుతుంది. సాధారణంగా బియ్యం పిండితో వడియాలు పెట్టుకోవడం అందరికీ అలవాటే. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండితో కూడా అంతే రుచికరంగా, కరకరలాడే వడియాలను సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. ఈ రాగి వడియాలను సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగిపిండి: 1 కప్పు
సగ్గుబియ్యం: 1/4 కప్పు (మిక్సీ పట్టిన పొడి)
నీళ్లు: మొత్తం 8 కప్పులు (కలపడానికి 2 కప్పులు + ఎసరు కోసం 6 కప్పులు)
పచ్చిమిర్చి: 3 నుంచి 5 (కారం తగినంత)
అల్లం: చిన్న ముక్క
వాము: 1/2 టీస్పూన్
నువ్వులు: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రాగిపిండి – మిక్సీ పట్టిన పావు కప్పు సగ్గుబియ్యం పొడి తీసుకోవాలి. ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో తయారు చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, వాము, నువ్వులు వేసి బాగా మరిగించాలి.
ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకు సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆపి కొంచెం చల్లారనివ్వాలి. ఒక కాటన్ వస్త్రాన్ని తడిపి పరిచి, దానిపై చిన్న చిన్న గరిటెలతో వడియాలను పెట్టుకోవాలి. వీటిని ఎండలో లేదా ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. అంతే సింపుల్ ఈ వడియాలు బాగా ఎండిన తర్వాత వడియాలు రెడీ అయి పోతాయ్.
నిల్వ – వేయించడం
వడియాలు బాగా ఎండిన తర్వాత వస్త్రం వెనుక భాగంలో కొద్దిగా నీళ్లు చిలకరిస్తే అవి సులభంగా ఊడి వస్తాయి. వీటిని మరో రోజు ఎండలో ఆరబెట్టి డబ్బాలో భద్రపరుచుకోవాలి. కావాల్సినప్పుడు వేడి నూనెలో వేయిస్తే ఇవి రెట్టింపు సైజులో పొంగి, ఎంతో కరకరలాడుతూ ఉంటాయి. రాగులలో క్యాల్షియం – ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి చలవ చేసే రాగిపిండితో ఇలా వడియాలు చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
