Crash Dieting: త్వరగా బరువు తగ్గాలనే లక్ష్యంతో క్రాష్ డైటింగ్, ఫ్యాడ్ డైట్స్ను అనుసరించే యువత ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వేగంగా బరువు తగ్గిన, పోషకాహార లోపంతో బాధపడుతున్న యువతలో క్షయవ్యాధి (టీబీ) కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. టీబీకి కారణం బ్యాక్టీరియా అయినప్పటికీ, ప్రతి ఒక్కరికి వ్యాధి సోకదు. శరీరంలోని రోగనిరోధక శక్తి బలంగా ఉంటే టీబీ బ్యాక్టీరియా నిష్క్రియంగానే ఉంటుంది. అయితే క్రాష్ డైటింగ్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆహార సమూహాలను పూర్తిగా మానేసే ఫ్యాడ్ డైట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను తగ్గించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
వైద్యులు వెల్లడించిన రెండు సంఘటనలు ఈ ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఊబకాయం, మధుమేహంతో బాధపడుతూ అత్యంత కఠినమైన క్రాష్ డైట్ ద్వారా వేగంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. డెంగీతో ఆస్పత్రిలో చేరిన అతడికి ఊపిరితిత్తుల్లో అసాధారణ మార్పులు గుర్తించి పరీక్షలు చేయగా, చివరకు పల్మనరీ టీబీ ఉన్నట్లు తేలింది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా శరీరంలో నిష్క్రియంగా ఉన్న టీబీ చురుకుగా మారి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు.
మరో ఘటనలో కాలేజీలో బాడీ షేమింగ్కు గురైన 16 ఏళ్ల యువతి తీవ్రంగా ఆహారాన్ని తగ్గించి కొన్ని నెలల్లోనే 15–16 కిలోల బరువు కోల్పోయింది. అనంతరం ఆమెకు నిరంతర జ్వరం, ఛాతీ, కడుపు నొప్పులు రావడంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ కారణం గుర్తించలేకపోయారు. చివరకు బయాప్సీ పరీక్షల ద్వారా టీబీ నిర్ధారణ కాగా, నాలుగు నెలల పాటు యాంటీ-టీబీ చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుంది.
వర్షాకాలంలో జ్వరం వస్తే చాలామంది డెంగీ, మలేరియాగా భావిస్తుంటారు. అయితే జ్వరం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే, కారణం లేకుండా బరువు తగ్గితే లేదా స్కానింగ్లో అసాధారణ మార్పులు కనిపిస్తే టీబీ అవకాశాన్ని కూడా పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో నిర్ధారణ, చికిత్స తీసుకోవడం వల్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు.
బరువు తగ్గడం తప్పు కాదని, కానీ ఆరోగ్యకరమైన విధానంలో తగ్గడం ఎంతో ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల్య పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, వైద్యుల సలహాతో మాత్రమే డైట్ పాటించడం ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. బరువు తగ్గడమే కాదు, రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

