వైరస్ వ్యాప్తి ప్రమాదంతో పోలిస్తే, తల్లి తన శిశువుకు పాలు పట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ నియోనాటల్ ఫోరం తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, నిలోఫర్ వైద్య నిపుణులు మరిన్ని సందేహాలకు వివరంగా సమాధానమిచ్చారు. తల్లిపాలతో శిశువులకు వైరస్ సోకదని, తల్లికి పాజిటివ్ వచ్చినా బిడ్డకు పాలు పట్టవచ్చు అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టాలి, కరోనా స్వల్ప లక్షణాలున్నా నేరుగా పాలు పట్టవచ్చు. అయితే ఆ సమయంలో తల్లి సరైన రీతిలో మాస్కు ధరించాలన్నారు. కరోనా సోకిన శిశువులకుగానీ, పిల్లలకుగానీ ప్రత్యేక చికిత్స లేదు. శిశువుకు తల్లిపాలే పెద్ద మందు అని, దానిని మించిన ఔషధం లేదని తేల్చిచెప్పారు. తల్లిపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ దానంతట అదే చనిపోతుందని వివరించారు. గర్భిణులు టీకా తీసుకోరాదు. కానీ, ప్రసవం తర్వాత తీసుకోవచ్చు. బాలింతలు టీకా తీసుకొంటే ఎలాంటి ప్రమాదం లేదు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవటం వల్ల తల్లితోపాటు బిడ్డలోయాంటిబాడీస్ పెరుగుతాయని తెలిపారు.