Idol Cleaning Tips : భారతీయ సంస్కృతిలో ఇళ్లలో గణేశుడు , లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచుకుని పూజించడం అత్యంత పవిత్రమైన ఆచారం. విఘ్నాలను తొలగించే వినాయకుడు, సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇల్లు ఆనందమయంగా ఉంటుందని భక్తుల నమ్మకం. త్వరలోనే గణేష్ చతుర్థి పండుగ రాబోతుండటంతో ప్రతి ఇంటా సన్నాహాలు, షాపింగ్ జోరందుకున్నాయి. ఈ పండుగ సందర్భంగా పూజా గదిలోని వెండి, ఇత్తడి, రాగి విగ్రహాలను ఇంట్లోనే సులభంగా, కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి విగ్రహాలను శుభ్రపరిచే సులభమైన మార్గాలు
వెండి విగ్రహాలపై పేరుకుపోయిన నల్లటి మలినాలను తొలగించడానికి నిమ్మరసం, ఉప్పు మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, ఆ నీటిలో వెండి విగ్రహాలను అరగంట పాటు నానబెట్టాలి. అనంతరం మెత్తని టూత్బ్రష్తో సున్నితంగా రుద్ది మామూలు నీటితో కడిగి తడి లేకుండా దూది వస్త్రంతో తుడవాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పు కలిసి లోహానికి నష్టం కలగకుండా మురికిని వదిలిస్తాయి. మరొక పద్ధతిలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టూత్పేస్ట్ కలిపి విగ్రహానికి పూసి బ్రష్తో మెల్లగా రుద్ది కడిగితే నల్లటి మచ్చలు మాయమై విగ్రహాలు కొత్తవాటిలా మెరుస్తాయి.
ఇత్తడి, రాగి విగ్రహాల మెరుపును పునరుద్ధరించే చిట్కాలు
ఇత్తడి, రాగి విగ్రహాల రంగు వెలిసిపోతే బేకింగ్ సోడా , నిమ్మరసం పేస్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని విగ్రహాలకు పూసి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత గుడ్డతో తుడిచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది లోహపు ఆక్సీకరణను తొలగించి పూర్వ మెరుపును ఇస్తుంది. అలాగే వెనిగర్, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని విగ్రహంపై రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మొండి మలినాలు సులభంగా వదిలిపోతాయి. ఇక కేవలం రాగి పూత మాత్రమే ఉన్న విగ్రహాలైతే, సబ్బు నీటిని పూసి సున్నితమైన గుడ్డ లేదా బ్రష్తో కడగడం అత్యంత సురక్షితమైన మార్గం. ఈ చిన్న చిన్న ఇంజంటి చిట్కాలను పాటించి మీ ఇంట్లోని పూజా విగ్రహాలను ఈ పండుగకు సరికొత్తగా సిద్ధం చేసుకోవచ్చు.

