Crispy Ragi Vada: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. నిజానికి వీటిలో క్యాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చాలా మంది రాగులతో సంకటి లేదా జావ చేసుకుంటారు. కానీ సాయంత్రం పూట స్నాక్స్లా తినడానికి రాగి పిండితో కరకరలాడే వడలు చేసుకుంటే ఉంటుందీ.. ఇవి దాదాపు నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఈ టేస్టీ రాగి వడలను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి: 1 కప్పు.
వరి పిండి: 1/2 కప్పు (వడలు కరకరలాడటానికి).
సగ్గుబియ్యం: 1 కప్పు (నానబెట్టినవి).
ఉల్లిపాయలు: 1 (చిన్నగా తరిగినవి).
పచ్చిమిర్చి: 3 లేదా 4 (సన్నగా తరిగినవి).
వాము: 1 టీస్పూన్.
నువ్వులు: 2 టీస్పూన్లు.
వేరుశనగ పప్పులు: 2 టేబుల్ స్పూన్లు (కచ్చాపచ్చాగా దంచినవి).
కరివేపాకు: కొద్దిగా.
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా, పిండిలో వేయడానికి 2 టేబుల్ స్పూన్లు (వేడి చేసిన నూనె).
ఉప్పు: రుచికి సరిపడా.
తయారీ విధానం..
ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, వరి పిండి, నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వాము, నువ్వులు, దంచిన వేరుశనగ పప్పులు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేయడం వల్ల వడలు మరింత క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని వడల పిండిలా (మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా) కలుపుకోవాలి. కలిపిన పిండిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
15 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని, చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని వడల్లా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకుంటే వడలు బాగా కరకరలాడతాయి. కడాయిలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వడలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే రాగి వడలు రెడీ అయినట్లే. వీటిని నేరుగా లేదా ఏదైనా చట్నీతో తింటే ఆ రుచి మామూలుగా ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ హెల్తీ స్నాక్ని మీరు కూడా మీకు కుదిరినప్పుడు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
