Multigrain Flour: ఇప్పుడు అంతా ప్రొటీన్ ఫుడ్ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ గోధుమ పిండికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే రెడీమేడ్ ప్యాకెట్లు అయినా, ఇంట్లో తయారుచేసుకునే పిండి అయినా.. మల్టీగ్రెయిన్ పిండిని పోషకాల గనిగా భావిస్తున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే సరైన విధంగా కలపకపోతే అదే పిండి ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించే అవకాశముంది.
* మల్టీగ్రెయిన్ పిండిని తయారుచేసే సమయంలో చాలామంది 5 నుంచి 6 రకాల ధాన్యాలను ఒకేసారి కలుపుతుంటారు. కానీ, చాలా రకాల ధాన్యాలు కలపడం వల్ల ప్రతి ధాన్యం నుంచి శరీరం సమర్థంగా పోషకాలను గ్రహించలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధికంగా కలపడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు.
* ప్రత్యేకంగా సోయాబీన్ను ఎక్కువగా కలపడం కొందరికి హానికరం కావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు సోయాబీన్ పరిమాణంపై జాగ్రత్తగా ఉండాలి. అధికంగా వాడితే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* అలాగే శనగలు, మినపపప్పు వంటి పప్పుధాన్యాలను ప్రోటీన్ కోసం ఎక్కువగా కలుపుతుంటారు. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ అధిక మోతాదులో వాడితే రొట్టెలు గట్టిగా మారడం, రుచి తగ్గడం, జీర్ణ సమస్యలు రావడం జరుగుతుంది. మొత్తం పిండి బరువులో శనగల పరిమాణం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
* పప్పుధాన్యాలను అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగే అవకాశమూ ఉంది. కాబట్టి కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
* మల్టీగ్రెయిన్ పిండిని ఆరోగ్యకరంగా తయారు చేయాలంటే మీ శారీరక అవసరాలు, జీర్ణశక్తి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ధాన్యాలను ఎంచుకోవడం మంచిది. తక్కువ రకాల ధాన్యాలను సరైన నిష్పత్తిలో కలిపితేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు. అందుకే మల్టీగ్రెయిన్ పిండి అంటే ఎంత ఎక్కువ ధాన్యాలు కలిపితే అంత మంచిదని భావించకుండా, సమతుల్యంగా తయారు చేసుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
