Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు మన రూమ్ టెంపరేషన్ను తగ్గించి, మనకు సుఖాన్ని ఇస్తున్నప్పటికీ వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్, అలసట, శ్వాస సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్:
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తుంది. వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో మనకు దాహం అనిపించదు. నీరు తక్కువగా తాగుతారు. మనకు తెలియకుండానే మన శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఇలాంటి సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడి తల నొప్పి, అలసట, పొడి చర్మ, ఏకాగ్రతా లోపాలు ఏర్పడుతాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం:
చల్లని, పొడి గాలి వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా చికాకు పడుతుంది. ఏసీ వాతావరణంలో ఎక్కువగా గడిపే వారు గొంతు పొడిగా మారడం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ వ్యవస్థ చికాకు పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తమా, అలర్జీలు, సైనస్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఏసీ యూనిట్లు ఉన్న గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీని వల్ల దమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ఇది పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
టెంపరేచర్ షాక్:
ఏసీల వల్ల కొందరు ‘‘టెంపరేచర్ షాక్’’ అనే సమస్యను ఎదుర్కొంటారు. శరీరం బయట తీవ్రమైన వేడి నుంచి లోపల చల్లని వాతావరణానికి మారినప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం ఆ ఉష్ణోగ్రతలకు అలవాటు పడటంతో ఇబ్బంది పడుతుంది. దీని వల్ల అలసట, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటివి జరుగుతాయి.
ఇలా చేస్తే సమస్యలకు చెక్:
ఎయిర్ కండిషనర్ను పూర్తిగా మారేయాల్సిన పని లేదు. ఏసీని 24-26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సెట్ చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా దాహం వేయకపోయినా నీరు తాగాలి. నేరుగా ఏసీ గాలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి.
