నిరుద్యోగులకు భారతీయ రైల్వే తీపికబురును అందించింది. ఏకంగా 6 వేలకు పైగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 6,565 ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయడానికి షాట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై, 2026 జూలై 29 చివరి తేదీ వరకు కొనసాగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం, ఆర్ఆర్బి 323 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు, 6242 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హతలు
ఆర్.ఆర్.బి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సంబంధిత రంగంలో బి.ఎస్.సి./బి.టెక్./బి.ఇ./3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. 33 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటిఐ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకానికి ఎంపిక కావడానికి, అభ్యర్థులు ముందుగా CBT పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. విజయవంతమైన అభ్యర్థులను ఆ తర్వాత పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్ష కోసం ఆహ్వానిస్తారు. అన్ని దశలలోనూ ప్రతిభచూపిన అభ్యర్థులకు ఖాళీగా ఉన్న స్థానాలలో నియామకాలు చేపట్టడం జరుగుతుంది.
ఈ నియామకం ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 జీతం లభిస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 జీతం లభిస్తుంది. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడికానున్నాయి.
