ఆఫ్ఘనిస్థాన్ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తాలిబన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి… దేశ రాజధాని కాబూల్ను సైతం వాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. అమెరికా సైన్యం సైతం కాబూల్ను ఖాళీచేయడంతో సంబరాలు చేసుకున్నారు.. అయితే, తాలిబన్లకు పంజ్షీర్ లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. పంజ్షీర్…అంటే ఐదు సింహాలు అని అర్థం. పేరుకు తగ్గట్టే… పంజ్షీర్ ప్రజలు పోరాడుతున్నారు. తమ ప్రాంతంలోకి తాలిబన్లను అడుగు పెట్టనివ్వకుండా… పోరాటం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు… ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. పంజ్షీర్ సైన్యం నుంచి ఊహించని విధంగా.. ప్రతిఘటన ఎదురవుతోంది. ఏకఛత్రాధిపత్యానికి కొరకరాని కొయ్యగా మారిన… ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి.
తాలిబన్లను పంజ్షీర్ దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పంజ్షీర్ను ఎలాగైనా వశం చేసుకొనేందుకు… తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. వందల సంఖ్యలో తమ ఫైటర్లను కోల్పోయింది. ఖవాక్ వద్ద జరిగిన యుద్ధంలో… 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్టు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 40మందికి పైగా తాలిబన్ ఫైటర్లను పట్టుకొని ఖైదు చేసినట్టు ట్విటర్లో తెలిపింది. అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో… త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. పంజ్షీర్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా… ఆ ప్రాంతం నేతలతో చర్చలు విఫలమయ్యాయి. పంజ్షీర్ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ… వారు పట్టించుకోవడం లేదు. యుద్దానికే సై అంటున్నారు. తాలిబన్ నేతలకు లొంగిపోయే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
