Pakistan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యువత చేసిన ఆందోళనల కారణంగా కేంద్రం వెనకడుగు వేసింది. కొత్తగా ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో Gen Z నిరసలన తర్వాత, భారత్లో కూడా యువ ఉద్యమం జరిగింది. అయితే, పాకిస్తాన్లో ఇలాంటి ఉద్యమాలు సాధ్యం ఎందుకు కావడం లేదని చాలా మందిలో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆర్థిక సంక్షోభం, ప్రజాస్వామ్యం సరిగా లేకపోయినా, ప్రజలపై సైన్యం పెత్తనం ఉన్నా కూడా ఆ దేశంలో యువత ఉద్యమం చేయడం లేదు.
విదేశాంగ విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మన్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ను ప్రశ్నించారు. “అవినీతి, అణచివేత, నిరుద్యోగం, యువతలో అసంతృప్తి వంటి అంశాలు పాకిస్థాన్లో కూడా ఉన్నాయి. అయినా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడు భారత్లా యువజన ఉద్యమం ఎందుకు కనిపించడం లేదు?” అని ప్రశ్నించారు. మరోవైపు భారత్లో యువ ఉద్యమానికి పాకిస్తాన్ యువత మద్దతు తెలిపింది.
దీనికి మూడు కారణాలు:
ఇతర దేశాలలో ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉంది. ప్రజలు నిరసన తెలిపేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తాయి. కానీ, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనిపించినా సైన్యం పెత్తనం ఉంటుంది. ఎదురుతిరిగితే బుల్లెట్లతో సమాధానం ఇస్తారు. ఇక భారత్, బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలకు విద్యార్థి సంఘాలు ఉంటాయి. పాకిస్తాన్లో అలాంటి పరిస్థితులు ఉండవు. పాకిస్తాన్లో ప్రధానంగా 3 కారణాలు విద్యార్థులు ఉద్యమాలు చేయకుండా అడ్డుకున్నాయి.
* 1980లలో జనరల్ జియా-ఉల్-హక్ పాలనలో విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడంతో విద్యార్థి రాజకీయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మైఖేల్ కుగెల్మన్ పేర్కొన్నారు.
* 1968-69లో అధ్యక్షుడు అయూబ్ ఖాన్ను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ తర్వాత క్యాంపస్ రాజకీయాలు బలహీనపడ్డాయి.
* 2018 నుంచి 2022 వరకు జరిగిన స్టూడెంట్స్ సాలిడారిటీ మార్చ్ విద్యార్థి సంఘాల పునరుద్ధరణ కోసం డిమాండ్ చేసినా, నిషేధం ఇప్పటికీ కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి నెట్వర్క్ ఏర్పడలేదు.
రాష్ట్రాలు, యువతలో ఐక్యత లేకపోవడం:
పాకిస్తాన్లో బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తామంతా పాకిస్తాన్లో భాగంగా భావించవు. ఒక్కోక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. పాకిస్తాన్ అంటే పంజాబ్, పంజాబ్ అంటే పాకిస్తాన్గా మిగతా రాష్ట్రాలు భావిస్తుంటాయి. సైన్యం, రాజకీయాల్లో వీరి ఆధిపత్యమే ఎక్కువ. చాలా వరకు నిధులు, అభివృద్ధి కూడా పంజాబ్కే కేంద్రీకృతమై ఉంటుంది. దీంతో యువతలో ఐక్యత ఉండదు.
పంజాబీలు, పష్తూన్లు, సున్నీలు, షియాలు అనే విభజనలు చాలా ఉన్నాయి. దీంతో పాక్లో యువ ఉద్యమం అనేది సాధ్యం కాదు. పాక్లోని విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు భారత్లో ఉద్యమాన్ని ప్రశంసిస్తున్నప్పటికీ, తమ దేశంలో యువతను ఏకతాటిపైకి తీసుకురాలేకపోతున్నారు.

