US: తక్షణమే పశ్చిమాసియాను ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక

  • మధ్యప్రాచ్యంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
  • మరికొన్ని గంటల్లో భీకరదాడులు జరగొచ్చని సంకేతాలు
  • ఇరాన్ కీలక సదుపాయాలపై దాడులు జరిగే అవకాశం
  • తక్షణమే ఖాళీ చేయాలని పౌరులకు అమెరికా వార్నింగ్
Iranus

Iranus

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే మరింత తీవ్రమైన దాడులు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ రాత్రికి గానీ.. రేపు రాత్రికి గానీ ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోవడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అత్యంత భీకరమైన దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధపడుతోంది.

ఈ నేపథ్యంలో తక్షణమే మధ్యప్రాచ్యాన్ని ఖాళీ చేయాలని పౌరులకు అమెరికా ఆదేశించింది. యూఏఈలోని అమెరికా రాయబార కార్యాలయం గంట క్రితమే తమ పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా పరిస్థితి సంక్లిష్టంగా ఉందని.. అది అకస్మాత్తుగా తీవ్రరూపం దాల్చవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లు మరింత జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విమానాల రద్దు.. అప్పుడప్పుడు గగనతల మూసివేత, సంభావ్య ప్రయాణ అంతరాయాలకు కూడా సిద్ధంగా ఉండాలని.. ఈ ప్రాంతంలోని కొన్ని విమానయాన సంస్థలు తమ పాత విమాన సర్వీసులను పునఃప్రారంభించడాన్ని ఆలస్యం చేయగా.. ​​మరికొన్ని కొన్ని మార్గాలను రద్దు చేశాయని తెలిపింది. ఈ ప్రాంతంలోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. పరిస్థితి మరింత దిగజారితే అందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. జోర్డాన్‌తో సహా ఇతర మధ్యప్రాచ్య దేశాల్లో కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ రాత్రికి లేదా రేపు రాత్రికి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. గతంలో కంటే ఎక్కువగా భీకరమైన దాడులు జరగొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రెండు దేశాలు దాడులు చేయొచ్చని వర్గాలు చెబుతున్నాయి. సీబీఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రాత్రి వరకు ఈ దాడులకు తుది ఆమోదం తెలపలేదు. కానీ శుక్రవారమే ఇరాన్‌పై చాలా బలమైన కొత్త దాడి జరగొచ్చని హెచ్చరించారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. టెహ్రాన్‌ లొంగిపోయేలా ఒత్తిడి చేసే లక్ష్యంతో ఇరాన్‌పై కొత్త దాడి చేయాలని ట్రంప్ సైన్యాన్ని ఆదేశించారు. ‘‘మేము వారిపై చాలా తీవ్రంగా దాడి చేయబోతున్నాము… ఇకపై భరించలేమని వారు చెప్పే సమయం వస్తుంది. మనం గెలవాలని మాత్రమే కోరుకుంటున్నాం. వారు అబద్ధాలు చెబుతూ, విషయాలను వక్రీకరిస్తున్నందున వారిపై నాకు నమ్మకం సన్నగిల్లుతోంది.’’ అని ట్రంప్ అన్నారు.

సీబీఎస్ నివేదిక ప్రకారం.. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై అత్యంత తీవ్రమైన దాడి కావచ్చు. సోమవారం స్టాక్ మార్కెట్ తెరిచేలోపే ఈ దాడిని పూర్తి చేయడంపై కూడా చర్చలు జరిగాయి. ఈ విషయం ఇజ్రాయెల్‌కు తెలియజేయబడిందని.. అది అమెరికాతో కలిసి పనిచేస్తోందని సమాచారం. నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ సీబీఎస్‌తో మాట్లాడుతూ.. ‘‘అమెరికా గెలుస్తుంది. ఆయన హయాంలో ఇరాన్‌కు అణ్వాయుధం ఉండదు.’’ అని అన్నారు. రక్షణ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని, చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉందని పెంటగాన్ ముఖ్య అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ కూడా తెలిపారు.

ఇరాన్ హెచ్చరిక

అమెరికాకు మద్దతు ఇచ్చే లేదా వాషింగ్టన్‌కు రక్షణ కవచంగా మారే ఏ దేశమైనా యుద్ధ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ హెచ్చరించారు. ఇరాన్‌పై దాడి జరిగిన తర్వాత టెహ్రాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. అందువల్లే ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.