US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన

  • ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు
  • హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
  • సైప్రస్ జెండా కలిగిన నౌకపై దాడి
Us Launches Fresh Strikes O

Us Launches Fresh Strikes O

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. హార్ముజ్ జలసంధిని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే, ఆ దేశంపై అమెరికా మరోసారి ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది. ఇదే వారంలో అమెరికా చేపట్టిన మూడో దాడి కావడం గమనార్హం.

సైప్రస్ జెండా కలిగిన నౌకపై దాడి

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న M/V GFS Galaxy అనే సైప్రస్ జెండా కలిగిన కంటైనర్ నౌకపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక సిబ్బంది కనిపించకుండా పోయినట్లు, నౌకలో అగ్నిప్రమాదం సంభవించి ఇంజిన్ గది తీవ్రంగా దెబ్బతినడంతో ప్రయాణాన్ని కొనసాగించే పరిస్థితి లేదని CENTCOM తెలిపింది.

అమెరికా ప్రతీకార చర్య

ఈ దాడికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టినట్లు CENTCOM పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడులు నిలిపివేయాలని ఇరాన్‌కు ఇప్పటికే అవకాశం ఇచ్చామని, అయినప్పటికీ మరోసారి అంతర్జాతీయ సముద్ర రవాణాపై దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో ఈ దాడులు కొనసాగుతున్నాయని CENTCOM స్పష్టం చేసింది.

“ఇరాన్ తప్పు నిర్ణయం తీసుకుంది”

CENTCOM ప్రకటించిన వివరాలపై స్పందించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, “ఇరాన్ తప్పు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

దక్షిణ ఇరాన్‌లో భారీ పేలుళ్లు

ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా కథనాల ప్రకారం, కేశ్మ్ ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అలాగే బందర్ అబ్బాస్‌లో మూడు పేలుళ్లు, సిరిక్ ప్రాంతంలో మరో రెండు పేలుళ్లు జరిగినట్లు ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది. దీంతో దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజా దాడులు జరిగినట్లు సంకేతాలు వెలువడ్డాయి.

హార్ముజ్ జలసంధి మూసివేత

అంతకుముందు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు ఏ నౌకకూ ఈ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఉండదని పేర్కొంది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని IRGC వెల్లడించింది.

హెచ్చరికలు జారీ చేసిన IRGC

హార్ముజ్ జలసంధి మూసివేతను సాకుగా చూపించి ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగితే తీవ్ర ప్రతిస్పందన తప్పదని IRGC హెచ్చరించింది. అవసరమైతే ప్రాంతంలోని శత్రు దేశాల సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. అలాగే ఈ పరిస్థితుల వల్ల తలెత్తే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్, అలాగే తమ భూభాగాల్లో విదేశీ సైనిక స్థావరాలకు అనుమతి ఇచ్చిన దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ ఆందోళన

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.