US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్

Usiran

Usiran

పశ్చిమాసియాలో మంగళవారం మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్న వేళ హార్ముజ్ దగ్గర ఆత్మ రక్షణ దాడులు చేసినట్లుగా అమెరికా తెలిపింది.  ఇరాన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి, తమ బలగాలను రక్షించుకోవడానికే దక్షిణ ఇరాన్‌లో ఆత్మరక్షణ దాడులు చేసినట్లు యూఎస్ వెల్లడించింది. దీంతో ప్రశాంతంగా ఉన్న మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో ఇరాన్ మరోసారి ప్రతీకారంతో రగిలిపోతుంది.

అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రాంతంలో అమెరికా సైన్యం దూకుడు చర్యలకు పాల్పడిందని, ఇరాన్ వాణిజ్య నౌకలపై సముద్ర దోపిడీ చర్యలు చేపట్టిందని ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడింది. 2026 ఏప్రిల్ 19న కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా అక్రమ, అన్యాయ చర్యలను కొనసాగిస్తోందని ఇరాన్ ఆరోపించింది. గత 48 గంటల్లో హార్మోజ్‌ ప్రాంతంలో జరిగిన చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఘోర ఉల్లంఘన అని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సముద్ర దోపిడీ చర్యలకు పాల్పడిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే సమయంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో దౌత్య చర్చలు కొనసాగుతుండగా అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం.. వాషింగ్టన్ పాలకుల ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టిందని ఇరాన్ విమర్శించింది. “అమెరికా ఇచ్చిన హామీలకు విలువ లేదని, ఇరాన్ ప్రజలపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని ఈ ఘటనలు నిరూపించాయి” అని పేర్కొంది. అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2, ప్యారాగ్రాఫ్ 4కు స్పష్టమైన ఉల్లంఘన అని ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల వల్ల కలిగే పరిణామాలకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

“ఇరాన్‌పై జరిగే ఏ దుష్ట చర్యనూ మేము ఉపేక్షించము. దేశ రక్షణ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయము” అంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా అణు చర్చల్లో కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజా శాంతి చర్చల్లో భాగంగా యురేనియంను విదేశాలకు తరలించే ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు సెమీ-అధికారిక తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం ఇంకా సంక్లిష్ట దశలోనే కొనసాగుతోంది.