NTV Telugu Site icon

Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడులు

Russia Ukraine War

Russia Ukraine War

Ukraine in the dark. Russian attack on power system: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా రష్యా దాడుల ఫలితంగా ఉక్రెయిన్ లో అంధకారం నెలకొంది. దేశంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కోటి మంది ఉక్రెయిన్లకు విద్యుత్ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం అన్నారు. ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. విద్యుత్ సరఫరాను పునురుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని జెలన్ స్కీ అన్నారు.

Read Also: Saudi Arabia: భారతీయులకు సౌదీ గుడ్ న్యూస్.. వీసా పొందాలంటే ఇకపై ఇది అవసరం లేదు

ఇటీవల ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది రష్యా. రాబోయే శీతాకాలంలో ఉక్రెయిన్ కు విద్యుత్ చాలా అవసరం. చలికాలంలో విద్యుత్ అందుబాటులో లేకుండా చలికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రజలు వలస వెళ్లాలనే రష్యా, తమ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుందని జెలన్ స్కీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో విద్యుత్ గ్రిడ్ దెబ్బతినడంతో కోతలు తీవ్రం అయ్యాయి.

మరోవైపు రెండు రోజుల క్రితం రష్యాదిగా చెప్పబడుతున్న ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడింది. నాటో దేశం అయిన పోలాండ్ లో క్షిపణి పడటంతో పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా నాటో దేశాలు రష్యాను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పలు యూరోపియన్ దేశాలు ఈ క్షిపణి రష్యాదే అని చెబుతున్నాయి. అయితే రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా వెస్ట్రన్ దేశాలు తమపై ఆరోపణలు చేస్తున్నాయని రష్యా విమర్శించింది. ఇది ఉక్రెయిన్ కు చెందిన క్షిపణి అని రష్యా ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే పోలాండ్ లో పడిన క్షిపణి మాది కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ స్పష్టం చేశారు. ఈ చర్యకు తమను నిందించవచ్చని కోరాడు.