ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ టర్కీలో కూడా కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ దగ్గర కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముగ్గురు దుండగులను హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది.
టర్కీ మీడియా ప్రకారం.. ముగ్గురు దుండగులు ప్రాణాంతకమైన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ కాన్సులేట్ వెలుపల కాల్పులకు పాల్పడ్డారని.. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నట్లు తెలిపింది. ఈ కాల్పుల ఘటనపై ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ చెప్పినట్లు టీఆర్టీ వరల్డ్ పేర్కొంది.
దౌత్య వర్గాల నివేదిక ప్రకారం.. ప్రస్తుతం టర్కీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలెవరూ లేరని పేర్కొన్నాయి. ఇస్తాంబుల్లోని కాన్సులేట్ జనరల్లో గానీ..అలాగే అంకారాలోని రాయబార కార్యాలయంలో గానీ ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఎవరూ లేరని సమాచారం. ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా అనేక మంది కీలక నేతలంతా చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడి చేయడమే కాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ డెడ్లైన్ విధించారు. 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని బెదిరించారు. దీంతో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
