పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారబోతుందా? వైమానిక దాడులతో దద్దరిల్లనుందా? మునుపటి కంటే.. భీకరంగా దాడులు జరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్ వైఖరిలో మార్పులు కనిపిస్తున్నాయి. శత్రువులపై కాలు దువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. శాంతి ఒప్పందం పేరుతో చర్చలు జరుపుతున్నా.. దాడులకు మాత్రం ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇరు పక్షాలు కూడా పరస్పర దాడులకు దిగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడుకుతోంది.
గత రాత్రి ఇరాన్లోని ప్రధాన లక్ష్యాలపై అమెరికా ఏడు గంటల పాటు భీకర దాడులు చేసింది. ఇప్పుడు మరోసారి అత్యంత భీకర స్థాయిలో దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోని అత్యంత భద్రత కలిగిన సిచ్యుయేషన్ రూమ్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరాన్కు భారీ నష్టం కలిగించి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలనే అమెరికా డిమాండ్ను అంగీకరించేలా ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా చర్చలు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
సిచ్యుయేషన్ రూమ్ సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్, సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్, వైట్హౌస్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సహా పలువురు కీలక అధికారులు హాజరైనట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై తీవ్ర స్థాయి దాడులకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా మీడియా ఆక్సియోస్ కథనం ప్రకారం.. ప్రస్తుతం అమెరికా లక్ష్యం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని తీవ్రంగా బలహీనపరిచేలా కీలక లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించడం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత ఇరాన్ మళ్లీ దాడులు ప్రారంభించింది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తాజా క్షిపణి దాడులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధం అమలు ప్రారంభించింది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
ఇక సమావేశానికి ముందు ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్పై వరుస దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ‘‘ఈ రాత్రి తీవ్రంగా దాడి చేస్తాం.. రేపు ఇంకా తీవ్రంగా దాడి చేస్తాం.. ఆ తర్వాతి రోజు కూడా అదే కొనసాగుతుంది. వచ్చే వారం పరిస్థితి ఇరాన్కు మరింత కఠినంగా మారుతుంది.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు కేంద్రీకృతమవుతాయని తెలిపారు. ఇరాన్ చర్చల బల్లపైకి వచ్చే వరకు ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారని, ఒప్పందం చేసుకోండి.. లేకపోతే మీ దగ్గర ఏమీ మిగలదని హెచ్చరించినట్లు ట్రంప్ వెల్లడించారు.
ప్రపంచ చమురు, సహజ వాయు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్-అమెరికా మధ్య పోటీ మరింత తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మరోసారి పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళ్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఈ ఏడాది ఏప్రిల్లో హార్ముజ్ జలసంధిపై మొదటిసారి దిగ్బంధం అమలు చేసి.. అనంతరం తాత్కాలిక అణు చర్చల ఒప్పందం తర్వాత జూన్లో ఎత్తివేసింది. అయితే చర్చలు నిలిచిపోవడం, జలసంధి ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు పెరగడంతో తాజా దిగ్బంధాన్ని మరోసారి అమల్లోకి తీసుకొచ్చింది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సమస్యలొచ్చాయి. అయితే ఇటీవల శాంతి ఒప్పందం ద్వారా పరిస్థితిలు సద్దుమణుగుతాయని అనుకుంటే.. అందుకు భిన్నంగా మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

