రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారా? మళ్లీ తన దూతలను రంగంలోకి దింపారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మధ్య కాలంలో మరోసారి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరమైంది. ఇటీవల కర్గిజ్స్థాన్లో జరిగిన ఎస్సీవో సమావేశం సందర్భంగా యుద్ధాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ప్రధాని మోడీ కోరారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా కీవ్ పర్యటనలో యుద్ధం ముగింపునకు భారత్ పాత్ర పోషిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలియజేశారు.
తాజాగా ట్రంప్ కూడా యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ వారాంతంలో మాస్కో, కీవ్లో పర్యటించే అవకాశం ఉంది. యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై ఇరు దేశాలతో చర్చలు జరపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ TASS కథనం ప్రకారం.. విట్కాఫ్, కుష్నర్ శనివారం, ఆదివారం రష్యా, ఉక్రెయిన్లను సందర్శించనున్నారు. అయితే వారి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను క్రెమ్లిన్ అధికారికంగా ధృవీకరించలేదు.
పర్యటనపై క్రెమ్లిన్ ఏమంటోంది?
ట్రంప్ ప్రతినిధుల పర్యటనపై నేరుగా స్పందించేందుకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన చేయబోమని, సంబంధిత భేటీలు జరిగినప్పుడు అధికారికంగా సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం.. ట్రంప్ ప్రతినిధులు రానున్న రోజుల్లో మాస్కో, కీవ్లో పర్యటించనున్నట్లు గురువారం వెల్లడించారు. కీవ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ వర్గం తెలిపింది. ఆదివారం కీవ్ పర్యటనకు అవకాశమున్నట్లు సమాచారం.
మాస్కో, కీవ్లో కీలక చర్చలు
విట్కాఫ్, కుష్నర్ గతంలో జనవరిలో మాస్కోను సందర్శించారు. అప్పట్లో క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో దాదాపు నాలుగు గంటల పాటు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఇప్పుడు మరోసారి ఇరు దేశాల పర్యటనకు సిద్ధమవుతుండటం.. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ బృందం నేరుగా దౌత్య ప్రయత్నాలు చేస్తున్నదానికి సంకేతంగా భావిస్తున్నారు. అయితే కీవ్ పర్యటన మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్ వెళ్లకూడదని రష్యా కోరుతున్నట్లు, వారి ప్రణాళికలను మార్చేందుకు మాస్కో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
దౌత్యపరమైన ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నప్పటికీ.. యుద్ధాన్ని ముగించే అంశంలో మాస్కో, కీవ్ మధ్య కీలక విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్కు సంబంధించిన నాలుగు ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించడంతో పాటు నాటోలో చేరాలన్న ఆకాంక్షను ఉక్రెయిన్ వదులుకోవాలని మాస్కో డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో రష్యా వైఖరి ఏమాత్రం మారలేదని పెస్కోవ్ స్పష్టం చేశారు. అయితే రష్యా షరతులను ఉక్రెయిన్ తిరస్కరిస్తోంది. తాము భారీ మూల్యం చెల్లించి కాపాడుకున్న భూభాగాన్ని అప్పగించడం శాంతి ఒప్పందం కాదని, అది లొంగుబాటు అవుతుందని కీవ్ వాదిస్తోంది.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం స్పందిస్తూ.. యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో రష్యా గగనతలాన్ని విదేశీ విమానయాన సంస్థలు ఉపయోగించవద్దంటూ ఉక్రెయిన్ చేసిన హెచ్చరికపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ఈ చర్య చర్చలను మరింత క్లిష్టం చేసే ముప్పుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో చివరి చర్చలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో చివరిసారిగా ఫిబ్రవరిలో చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగిన కొద్దికాలానికే అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విట్కాఫ్, కుష్నర్ తాజా మాస్కో-కీవ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ బృందం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

