ఇంధన వసతులపై దాడులు చేసుకోవద్దని రష్యా-ఉక్రెయిన్లకు అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఈ ప్రతిపాదనకు అంగీకారం తెల్పుతున్నట్లుగా రెండు దేశాలు అంగీకరించాయి. కానీ గంటల వ్యవధిలోనే శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కాయి. ట్రంప్ మాటలను ఖాతర్ చేయకుండా ఇంధన వసతులపై పరస్పరం దాడి చేసుకున్నాయి. కీవ్లో పెట్రోల్ బంకులు, ఇతర ఇంధన వసతులను రష్యా లక్ష్యంగా చేసుకోగా.. ఉక్రెయిన్.. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారం, డ్రోన్ తయారీ కేంద్రాలపై దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.
కీవ్పై రష్యా భారీ డ్రోన్ దాడులు
రాత్రికి రాత్రే రష్యా ఉక్రెయిన్పై దాదాపు 200 డ్రోన్లతో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కీవ్తో పాటు పలు నగరాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మరణించినట్లు సమాచారం. కీవ్లోని పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎనర్జీ, పోర్టు మౌలిక వసతులను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ ప్రకటించిన ఎనర్జీ టార్గెట్లపై దాడుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.
ఉక్రెయిన్ దాడి
మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతిదాడులకు దిగింది. రష్యాలోని సమారా ప్రాంతంలోని సిజ్రాన్లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అంతేకాకుండా టాగన్రోగ్, ఒరియోల్ ప్రాంతాల్లోని డ్రోన్ తయారీ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు.
ట్రంప్ ఏం ప్రకటించారు?
ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాల్లో భాగంగా రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం ఎనర్జీ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోకూడదని అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. ‘‘రష్యా ఎనర్జీ టార్గెట్లపై దాడులు చేయకూడదని ఉక్రెయిన్ అంగీకరించింది. అలాగే ఉక్రెయిన్ ఎనర్జీ టార్గెట్లపై దాడులు చేయకూడదని రష్యా అంగీకరించింది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. కానీ ట్రంప్ మాటలను పట్టించుకోకుండా దాడి చేసి కున్నాయి.

