Site icon NTV Telugu

Trump-Sanae Takaichi: ట్రంప్‌తో జపాన్ ప్రధాని భేటీ.. షాకింగ్ ప్రశ్నకు అసౌకర్యానికి గురైన సనాయే తకైచి

Trump11

Trump11

పశ్చిమాసియాలో భీకర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ద్వైపాక్షిక చర్చల కోసం జపాన్ ప్రధాని సనాయే తకైచి వైట్‌హౌస్‌కు వచ్చారు. ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్నతో ఒక్కసారిగా సనాయే తకైచి ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైట్‌హౌస్‌లో గురువారం ట్రంప్‌తో జపాన్ ప్రధాని సనాయే తకైచి సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తొలుత ట్రంప్-తకైచి మధ్య సరదా సన్నివేశం ప్రారంభమైంది. తకైచికి ఇంగ్లీష్ బాగా వచ్చని ప్రశ్నించారు. అనువాదం అవసరమే లేదని సరదాగా వ్యాఖ్యానించారు. అనువాదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం మంచి విషయంగా పేర్కొన్నారు. ఇక ‘‘వచ్చేసారి మీ భాష (జపనీస్) నేర్చుకుని వస్తాను.’’ అని సరదాగా ట్రంప్ తెలిపారు.

ఇలా సరదాగా సాగుతున్న సమావేశం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జపనీస్‌కు చెందిన ఒక విలేఖరి ట్రంప్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇరాన్‌పై దాడి చేయడానికి ముందే మాకు ఎందుకు చెప్పలేదు?.’’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘మేము ఆశ్చర్యపరచాలనుకున్నందుకే ఎవరికీ చెప్పలేదు. అయినా ఆశ్చర్యాల గురించి జపాన్ కంటే బాగా ఎవరికి తెలుసు ?.’’ అని వ్యాఖ్యానించారు. వెంటనే తకైచి వైపు తిరిగి.. ‘‘పెర్ల్ హార్బర్ గురించి మీరు నాకు ఎందుకు చెప్పలేదు?.’’ అని నిలదీశారు. ట్రంప్ వ్యాఖ్యతో సనాయే తకైచి అసౌకర్యానికి గురైనట్లు కనిపించారు. దానికి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. బహుశా సనాయే తకైచికి బదులుగా అనువాదకురాలి మాట్లాడుతున్నందున స్పందించలేనట్లుగా కనిపించింది.

పెర్ల్ హార్బర్‌…
1941 డిసెంబర్ 7(ఆదివారం)న పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి చేయడంతో ఈ ఘటనలో 2,400 మందికి పైగా అమెరికన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా అనేక యుద్ధ విమానాలు, నౌకలు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 నౌకలు, 300కు పైగా విమానాలు నాశనం అయ్యాయి. ఈ సంఘటనతో మరుసటి రోజే అమెరికా రెండో ప్రపంచం యుద్ధంలోకి దిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణు బాంబులను వేశాయి. చరిత్రలో అణ్వాయుధాలను ఉపయోగించడం ఇదే ఏకైక సంఘటనగా భావిస్తారు. అణ్వాయుధాలు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చరిత్ర గుర్తుచేసుకునప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు.

ఇదిలా ఉంటే గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి సంఘర్షణల మధ్య వైట్‌హౌస్‌లో తొలిసారి ట్రంప్‌ను కలిసిన ప్రపంచ నేతల్లో సనాయే తకైచినే కావడం విశేషం.

Exit mobile version