Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!

  • భారత్ విద్యార్థులకు బిగ్ షాక్
  • ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలు
  • డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి ముగింపు
Usvisa

Usvisa

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఈసారి విద్యార్థుల చదువులపై తీవ్ర ఆంక్షలు విధించింది. అమెరికాలో చదువుతున్న.. చదవాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా విద్యార్థి వీసా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులతో ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త విధానం ప్రకారం.. ఇకపై ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు ఆటోమేటిక్‌గా అమెరికాలో ఉండలేరు. వారి వీసాకు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కూడా చదువు, పరిశోధన లేదా శిక్షణ కొనసాగాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి F-1 స్టూడెంట్ వీసా, J-1 ఎక్స్చేంజ్ విజిటర్ వీసా, విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే I వీసాలకు వర్తించనున్నాయి.

డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S) విధానానికి ముగింపు

ఇప్పటివరకు అమల్లో ఉన్న Duration of Status (D/S) విధానం ప్రకారం విద్యార్థులు పూర్తి సమయ చదువు కొనసాగిస్తూ.. వీసా నిబంధనలు పాటిస్తే కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. ఈ విధానం వల్ల విద్యార్థులు యూనివర్సిటీ మార్చుకోవచ్చు, కోర్సు మార్చుకోవచ్చు
మాస్టర్స్ తర్వాత పీహెచ్‌డీ చేయవచ్చు. ప్రతి దశలో కొత్త ఇమ్మిగ్రేషన్ అనుమతులు అవసరం ఉండేది కాదు.

ఇకపై ఏం చేయాలి?

తాజాగా వెలువడిన కొత్త నిబంధనల ప్రకారం నాలుగేళ్లకు మించి చదువు కొనసాగాలంటే విద్యార్థులు ప్రత్యేకంగా స్టే ఎక్స్‌టెన్షన్ కోసం దరఖాస్తు చేయాలి. దీనిలో భాగంగా అదనపు పత్రాలు సమర్పించాలి.
బయోమెట్రిక్ ధృవీకరణ ఇవ్వాలి.. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ పరిశీలన ఎదుర్కోవాలి. అనుమతుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావచ్చు. అలాగే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. ఈ 30 రోజుల్లో అమెరికా విడిచి వెళ్లాలి. లేదా మరో వీసా కేటగిరీకి మారాలి. లేకపోతే అక్రమంగా అమెరికాలో ఉన్నట్లుగా పరిగణించే అవకాశం ఉంది.

భారత విద్యార్థులపై భారీ ప్రభావం

Open Doors 2024 నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3.31 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అమెరికాలో ఉన్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు 30 శాతం మంది భారతీయులే. వీరిలో చాలా మంది పీహెచ్‌డీ, రీసెర్చ్ ఆధారిత మాస్టర్స్, ప్రత్యేక సాంకేతిక కోర్సులు చదువుతున్నారు. ఇవి సాధారణంగా నాలుగేళ్లకు మించి కొనసాగుతాయి. దీంతో ఈ విద్యార్థులు ఇకపై అదనపు ఇమ్మిగ్రేషన్ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. విద్యాసంస్థలు, విద్యా నిపుణులు ఈ కొత్త నిబంధనల వల్ల అధిక పేపర్‌వర్క్, వీసా అనిశ్చితి, OPT వంటి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మార్పులకు కారణమేంటి?

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రకారం ఈ మార్పుల ఉద్దేశం ఇతర తాత్కాలిక వీసాల మాదిరిగానే విద్యార్థి వీసాలకు కూడా నిర్దిష్ట కాలపరిమితి తీసుకురావడమే. అలాగే వీసాల దుర్వినియోగం, మోసాలు, గడువు మించి అమెరికాలో ఉండటం, పదేపదే కోర్సులు మార్చుకుంటూ దేశంలోనే కొనసాగడం వంటి సమస్యలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అంతర్జాతీయ విద్యా సంస్థల సంఘం NAFSA ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. సంస్థ సీఈఓ ఫాంటా అవ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు బాగా పనిచేస్తున్న వ్యవస్థలో అనవసరంగా అనిశ్చితి, అధిక అధికార యంత్రాంగం, భయాన్ని తీసుకొస్తున్నారు. లేని సమస్యకు పరిష్కారం వెతుకుతున్నట్లుగా ఈ నిర్ణయం ఉంది.’’ అని వ్యాఖ్యానించారు.

విద్యార్థులకు సూచనలు

కొత్త నిబంధనలు ఈ ఏడాది చివర్‌లో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా నిబంధనలను పాటించాలని.. DHS, USCIS విడుదల చేసే తాజా మార్గదర్శకాలను గమనించాలని.. నాలుగేళ్లకు మించి కోర్సు కొనసాగే విద్యార్థులు ముందుగానే స్టే ఎక్స్‌టెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం కావాలని.. తమ యూనివర్సిటీల అంతర్జాతీయ విద్యార్థి విభాగాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.