Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?

  • మరో దేశంపై అమెరికా సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?
  • అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థే లక్ష్యంగా దాడులు
  • ది వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనం
Trump

Trump

అమెరికా మరొక దేశంపైకి యుద్ధానికి వెళ్లబోతుందా? ప్రపంచంలో మరో యుద్ధం ఖాయమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంలో సైనిక చర్య చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వల్-ముస్లిమీన్ (JNIM) అనే అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థపై వైమానిక దాడులు చేపట్టే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా సైనిక దాడులకు అనుమతించిన ఎనిమిదో దేశంగా మాలీ నిలవనుంది. విదేశీ యుద్ధాలను తగ్గిస్తానని గతంలో హామీ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత విస్తరిస్తున్నారనే చర్చ మొదలైంది.

వైట్ హౌస్‌లో భిన్నాభిప్రాయాలు

ఈ ప్రతిపాదనపై అమెరికా ఉన్నతాధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ డైరెక్టర్ సెబాస్టియన్ గోర్కా సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ప్రముఖ అధికారుల్లో ఒకరుగా పేర్కొంటున్నారు. అయితే మరికొందరు అధికారులు మాత్రం ఈ చర్యపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ తొలి ప్రభుత్వంలో పనిచేసిన మాజీ అధికారి పీటర్ ఫామ్ మాట్లాడుతూ.. సైనిక చర్యకు ముందు మాలీ, నైజర్ ప్రభుత్వాలతో నమ్మకాన్ని పునరుద్ధరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘మాలీ వంటి దేశాల్లో అమెరికాకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా లేకపోయినా.. ఐసిస్, అల్‌ఖైదా వంటి జిహాదీ ఉగ్రవాద సంస్థలు అక్కడ బలపడకూడదు.’’ అని అన్నారు.

మాలీలో ఉగ్రవాదం 

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. JNIM ప్రస్తుతం మాలీలో బలమైన స్థావరాన్ని ఏర్పరుచుకుని పొరుగు తీరప్రాంత పశ్చిమ ఆఫ్రికా దేశాలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. దీంతో సాహెల్ ప్రాంతం ప్రపంచంలోనే ఉగ్రవాద కార్యకలాపాల ప్రధాన కేంద్రంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో JNIM దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలపై భారీ దాడులు చేసి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆత్మాహుతి దాడిలో మాలీ రక్షణ మంత్రిని హతమార్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

2020, 2021 సైనిక తిరుగుబాట్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మాలీ సైనిక ప్రభుత్వం.. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తొలుత వాగ్నర్ గ్రూప్, అనంతరం ఆఫ్రికా కార్ప్స్ పేరుతో రష్యా కిరాయి బలగాల సహాయాన్ని తీసుకుంటోంది. అయితే రష్యా మాలీలో సమర్థవంతమైన భద్రతా భాగస్వామిగా నిరూపించుకోలేకపోయిందని అమెరికా ప్రభుత్వం విమర్శించింది. అలాగే మాలీ భద్రతా బలగాలు, రష్యా కిరాయి సైనికులు పౌరులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.

మాలీపై అమెరికా నేరుగా సైనిక చర్య చేపడితే.. అక్కడ ఇప్పటికే ఉన్న రష్యా బలగాలతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిరియాలో అమలు చేసినట్లుగా ప్రత్యేక సమన్వయ వ్యవస్థ అవసరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు. సౌఫాన్ సెంటర్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు వాస్సిం నస్ర్ మాట్లాడుతూ.. మరోసారి సైనిక చర్య చేపట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. ‘‘ఫ్రాన్స్ పదేళ్లపాటు సైనిక చర్యలు చేపట్టింది.. రష్యా ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ పరిస్థితి మరింత దిగజారింది. కాబట్టి రాజకీయ చర్చలు, రాజీ ప్రయత్నాలే శాశ్వత పరిష్కారం.’’ అని అభిప్రాయపడ్డారు.

ఇంకా కొందరు విశ్లేషకులు.. అమెరికా దాడులతో JNIM బలహీనపడినా.. దాని వల్ల ఐసిస్ అనుబంధ ఉగ్రసంస్థలు మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికా మిషనరీ రక్షణ అంశం కూడా చర్చలో మాలీలో ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు భావిస్తున్న అమెరికా మిషనరీ కెవిన్ రైడౌట్ను రక్షించే అంశం కూడా అమెరికా అంతర్గత చర్చల్లో ప్రధాన అంశంగా మారిందని ది వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ప్రస్తుతం మాలీలో అమెరికా సైనిక చర్యపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే ఉగ్రవాద వ్యతిరేక చర్యల విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

ఇప్పటికే అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకుంది. ఇంకోవైపు ఇరాన్‌పై గత కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పుడు మరో దేశం దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.