భారత్, చైనా టారిఫ్ల అంశంపై తన సొంత అధికారులపైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్తో జరిగిన సమావేశంలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. తనకు అందించిన గణాంకాలను ‘తప్పుడు లెక్కలు’గా కొట్టిపారేసినట్లు సమాచారం.
ఈ విషయాలు ప్రముఖ జర్నలిస్టులు మాగీ హాబెర్మన్, జోనాథన్ స్వాన్ రచించిన ‘‘Regime Change: Inside the Imperial Presidency of Donald Trump’’ పుస్తకంలో వెల్లడయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన భారీ టారిఫ్ల నిర్ణయాలకు ముందు వైట్హౌస్లో జరిగిన అంతర్గత చర్చలు, విభేదాలను ఈ పుస్తకం ప్రస్తావించింది.
భారత్ టారిఫ్లపై ట్రంప్ అసంతృప్తి
పుస్తకం ప్రకారం.. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు అధికారికంగా చూపిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ నమ్మేవారు. అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) అందించిన గణాంకాలు ట్రంప్ అంచనాలకు భిన్నంగా ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ‘‘అమెరికాపై చైనా ఎంత టారిఫ్ విధిస్తోంది? భారత్ ఎంత టారిఫ్ విధిస్తోంది? దీనిపై నాకు ఎవరూ సరైన గణాంకాలు ఇవ్వడం లేదు. మీరు చెప్పేవన్నీ తప్పు లెక్కలే.’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ అధికారిక USTR గణాంకాలను చూపించినప్పటికీ ట్రంప్ వాటిని అంగీకరించలేదని రచయితలు వెల్లడించారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్ కనీసం 175 శాతం వరకు టారిఫ్లు విధిస్తోందని.. వాస్తవ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని ట్రంప్ భావించేవారని పుస్తకం పేర్కొంది. ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ మాజీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ భారత్ను ‘టారిఫ్ల మహారాజా’గా అభివర్ణించిన విషయం కూడా ప్రస్తావించింది.
అమెరికా-భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వైట్హౌస్ ఫ్యాక్ట్షీట్లో కూడా భారత్ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటిగా పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులపై సగటు 37 శాతం టారిఫ్లు, కొన్ని ఆటోమొబైల్ ఉత్పత్తులపై 100 శాతానికి మించిన సుంకాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ వివాదాల మధ్య ట్రంప్ తన ‘‘లిబరేషన్ డే’’ టారిఫ్లలో భాగంగా భారత దిగుమతులపై మొదట 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు భారత్పై మరో 25 శాతం అదనపు టారిఫ్ విధించారు. దీంతో భారత ఉత్పత్తులపై మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి చేరింది. ట్రంప్ అప్పట్లో ‘‘భారత్ పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ఇస్తోంది’’ అంటూ విమర్శలు చేశారు.
టారిఫ్ వివాదాల కారణంగా అమెరికా-భారత్ సంబంధాలు కొంతకాలం ఉద్రిక్తంగా మారాయి. అయితే 2026 ఫిబ్రవరి 2న రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఒక రూపరేఖపై అంగీకరించాయి. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికాలోకి వచ్చే భారత ఉత్పత్తులపై టారిఫ్లు 18 శాతానికి తగ్గనున్నాయి. మరోవైపు భారత్ కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, సోయాబీన్ ఆయిల్, పండ్లు, వైన్, స్పిరిట్స్ వంటి వస్తువులపై సుంకాలను తగ్గించేందుకు అంగీకరించింది. అదనంగా భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీ ఇవ్వడంతో అమెరికా విధించిన అదనపు 25 శాతం టారిఫ్ను ఉపసంహరించుకునేందుకు ట్రంప్ అంగీకరించినట్లు వైట్హౌస్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై తదుపరి చర్చలు జరిపినట్లు సమాచారం.

