ఇరాన్తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అలా ప్రకటించారో.. లేదో టెహ్రాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేస్తోంది. తాము టెహ్రాన్లో మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘‘టెహ్రాన్ వ్యాప్తంగా ఇరాన్ ఉగ్రవాద పాలన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ ఇప్పుడే మరో విడత దాడులను ప్రారంభించింది..’’ అని పేర్కొంది.
మరోవైపు ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈతో సహా గల్ఫ్ అంతటా ఉన్న చమురు, గ్యాస్ సౌకర్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుంది. శనివారం అమెరికా ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై దాడి చేయగా.. టెహ్రాన్ హిందూ మహాసముద్రంలోని అమెరికా-యూకే స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిలో ఏదీ లక్ష్యాన్ని చేరలేదు. ట్రంప్కు ఆశ్చర్యకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
ఆదివారం ఇరాన్తో సంభాషణలు జరిగాయని.. అతి త్వరలోనే ఒక ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఈ చర్చల్లో మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారని తెలిపారు. యుద్ధాన్ని ముగించడంపై అమెరికా, ఇరాన్లు చర్చలు జరుపుతున్నాయని… ఇరు దేశాల మధ్య ‘‘ప్రధానమైన అంగీకార అంశాలు’’ ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
