ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబడిన వారి అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాలో పుట్టినా ఈ పాటికే అది ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.
భారత్లో కూడా ఒమిక్రాన్ అలజడి ప్రారంభం అయింది. ఫిబ్రవరి.. మార్చి నెలలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య విపరీతం గా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో మన దేశం లో కూడా బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాయి. కానీ కేంద్రం తిరస్కరించింది. కాగా ఐసీఎంఆర్ బూస్టర్ డోసుపై కీలక ప్రకటన చేసింది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని తెలిపింది. కానీ ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
