బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ నవంబర్లో భారత్లో పర్యటించే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చే అంశంపై భారత్, బంగ్లాదేశ్ మధ్య అధికారిక స్థాయిలో చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే పర్యటన తేదీ, అజెండా ఇంకా ఖరారు కాలేదని సమాచారం.
ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు రావాలని రెహమాన్కు భారత్ రెండు సార్లు ఆహ్వానం పంపింది. కానీ రెహమాన్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. తారిఖ్ రహమాన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన తేదీ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసే దిశగా ఇరు దేశాల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రెండు ఆహ్వానాలు
తారిఖ్ రహమాన్కు భారత్ ఇప్పటికే రెండు వేర్వేరు ఆహ్వానాలు పంపినట్లు సెప్టెంబర్ 15న విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకటి ద్వైపాక్షిక పర్యటన కోసం కాగా.. మరొకటి భారత్ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం ఇచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ప్రధానిని ద్వైపాక్షిక పర్యటనకు భారత్ ఆహ్వానించిందని, అనంతరం BIMSTEC చైర్ హోదాలో బ్రిక్స్ సదస్సుకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు. అయితే ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించిన భారత ఆహ్వానంపై బంగ్లాదేశ్ నుంచి స్పందన రాలేదని జైస్వాల్ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సున్నితంగా మారిన నేపథ్యంలో తారిఖ్ రహమాన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 2024లో దేశాన్ని విడిచిపెట్టి భారత్కు వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతుండగా.. భారత్ ఇప్పటివరకు ఆమెను అప్పగించలేదు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
గంగా జలాలు చర్చకు వచ్చే అవకాశం?
తారిఖ్ రహమాన్ పర్యటన ఖరారైతే.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్లో గడువు ముగియనున్న గంగా జలాల ఒప్పందం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తారిఖ్ రహమాన్ సెప్టెంబర్ 21న 81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లనున్నారు. రానున్న వారాల్లో ఆయనకు ఉన్న ఇతర దౌత్య కార్యక్రమాలు కూడా భారత్ పర్యటన తేదీ ఖరారుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తారిఖ్ రహమాన్ భారత్ పర్యటనకు సంబంధించిన తేదీ, అజెండా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

