Hormuz Tank Attacks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన సరఫరా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్కు చేరాయి. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం (MOU) ఉన్నప్పటికీ, సముద్ర గర్భంలో ఘర్షణలు పూర్తిగా సమసిపోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా మూడు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వాణిజ్య నౌకపై అజ్ఞాత క్షిపణి దాడి జరిగింది. బ్రిటన్ నావికాదళ సంస్థ ‘యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ (UKMTO) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
ఒక్కరోజే మూడు దాడులు..
UKMTO వెల్లడించిన వివరాల ప్రకారం.. హోర్ముజ్ గుండా వెళ్తున్న ఒక భారీ వాణిజ్య ట్యాంకర్ను అజ్ఞాత క్షిపణి ఢీకొట్టింది. ఈ దాడి కారణంగా ఓడ యొక్క పైభాగం (స్ట్రక్చర్) తీవ్రంగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, చమురు లీకేజీ లేదా పర్యావరణ కాలుష్యం వంటి సంకేతాలు ఇప్పటివరకు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా దేశం బాధ్యత వహించలేదు. పరిస్థితిని గమనిస్తూ.. ఆ మార్గంలో ప్రయాణించే మిగతా నౌకలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ నావికా సంస్థ హెచ్చరించింది. దీనికంటే ముందు కూడా రెండు వేర్వేరు దాడులు జరిగాయి. అందులో సౌదీ అరేబియాకు చెందిన ఒక ముడి చమురు ట్యాంకర్ దెబ్బతినగా, మరో దాడి కతర్ నౌకపై జరిగింది.
ఇరాన్పై కతర్ సంచలన ఆరోపణలు
హోర్ముజ్ జలసంధిలో రాత్రి వేళ ప్రయాణిస్తున్న తమ ఎల్ఎన్జీ (LNG) గ్యాస్ నౌక ‘అల్ రెకాయ్యాత్’ పై ఇరానే డ్రోన్ దాడి చేసిందని కతర్ ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. డ్రోన్ వచ్చి నౌక ఇంజిన్ రూమ్పై పడటంతో భారీగా మంటలు, పొగ వ్యాపించాయి. నౌక కెప్టెన్ అత్యవసర సాయం కోసం చేసిన ‘మే-డే, మే-డే, మే-డే’ కాల్స్ అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ఓడలో అత్యంత ప్రమాదకరమైన LNG ఉన్నందున, మంటలు గనుక విస్తరిస్తే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరించారు. అయితే సకాలంలో స్పందించిన రక్షణ సిబ్బంది నౌకలోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ దాడిపై కతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ తీవ్రంగా స్పందించారు. “ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే. అంతర్జాతీయ ఇంధన సరఫరా భద్రతపై జరిగిన ఈ దాడిని కతర్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రాంతీయ భద్రతను ప్రమాదంలో పడేసే ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలి. ఈ దాడి వల్ల జరిగే పరిణామాలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు. ఈ వరుస దాడులతో ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా చేసే ప్రధాన మార్గంలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలోనైనా గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

