అగ్రదేశం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అటు రహదారులపైనా మంచు భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి
మరోవైపు మంచు తుఫాన్ కారణంగా పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటన చేశాయి. దీంతో సుమారు 4వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. అటు హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్ హాటన్కు సమీపంలోని లాంగ్ ఐలాండ్లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
