పశ్చిమాసియాలో కొత్తగా మరో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు చేసింది. అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
గత ఐదు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో ఇప్పుడు సౌదీ అరేబియా, యెమెన్ కూడా ప్రత్యక్ష ఘర్షణలోకి దిగాయి. శనివారం యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు సౌదీ అరేబియాలోని యన్బు (Yanbu), జిజాన్ (Jazan) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించగా.. చమురు నిల్వ కేంద్రాల్లో మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడులకు ముందు రోజు యెమెన్లోని హోదైదా (Hodeidah) ప్రాంతంలో హౌతీ మిలిటరీ స్థావరాలపై సౌదీ వైమానిక దాడులు నిర్వహించినట్లు రియాద్ ప్రకటించింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగిస్తున్న లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు సౌదీ తెలిపింది.
హోదైదాపై సౌదీ దాడులు
యెమెన్కు చెందిన అన్సార్ అల్లాహ్ (హౌతీ) గ్రూప్ ఆరోపణల ప్రకారం.. సౌదీ బలగాలు హోదైదా ప్రావిన్స్లోని కమరాన్ ద్వీపం (Kamaran Island)తో పాటు టెలికమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు జరిపాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. బాబ్ అల్-మందెబ్ జలసంధికి సమీపంలో ఉండే కమరాన్ ద్వీపం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ మార్గం గుండా సౌదీ చమురు ట్యాంకర్లు ప్రయాణిస్తుంటాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యం
సౌదీ తమ నియంత్రణలోని ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తే.. ఎర్ర సముద్రంలోని చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలతో పాటు సౌదీ అరాంకో చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, చమురు పైప్లైన్లను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు. ‘‘ఓడరేవుకు బదులుగా ఓడరేవు.. విమానాశ్రయానికి బదులుగా విమానాశ్రయం.. ప్రతి దాడికి అంతకంటే తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది.’’ అని హౌతీ గ్రూప్కు చెందిన ఓ సీనియర్ నేత హెచ్చరించినట్లు విదేశీ మీడియా పేర్కొంది.
ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. యెమెన్ క్షిపణి దాడుల అనంతరం యన్బు, జిజాన్ ప్రాంతాల్లో భారీగా పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. నాసా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. జిజాన్లోని సౌదీ అరాంకో చమురు నిల్వ ట్యాంకుల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు వెల్లడైంది. ఇక దాడుల అనంతరం యన్బు, జిజాన్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సౌదీ గగనతలంలోని కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పలువురు విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించినట్లు సమాచారం. అలాగే యెమెన్ నుంచి తెల్లవారుజామున జరిగిన ఈ ఆకస్మిక దాడుల నేపథ్యంలో దక్షిణ సౌదీ ప్రాంతాల్లోని ప్రజలకు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితిని సౌదీ భద్రతా బలగాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
🎥 ستونهای دود همچنان در آسمان شهر جیزان عربستان دیده میشود. https://t.co/NEAq3aeJ3i pic.twitter.com/rTnfcZyzDW
— خبرگزاری فارس (@FarsNews_Agency) July 25, 2026
🎥 توقف فعالیت فرودگاههای جازان و ینبع عربستان پساز حملات یمن
در پی حملات یمن به تأسیسات نفتی آرامکو، فعالیت فرودگاههای ینبع و جازان موقتاً متوقف شد.
همزمان دادههای رهگیری پرواز از اختلال در بخشی از ترافیک هوایی عربستان و تغییر مسیر یا زمان پرواز برخی هواپیماها خبر میدهد. https://t.co/CzPmsjLRo9 pic.twitter.com/RyigGNMP8E
— خبرگزاری فارس (@FarsNews_Agency) July 25, 2026

