మధ్యప్రాచ్యంలో మరో కొత్త ఘర్షణ మొదలైంది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సౌదీ అరేబియా-యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీలు, సౌదీ అరేబియా పరస్పరం దాడులు చేసుకున్నట్లు ఆరోపించుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో గత ఏడాది సౌదీ అరేబియాతో పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్థాన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బలూచిస్థాన్లో తిరుగుబాట్లు, అఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. సౌదీ తరఫున హౌతీలపై యుద్ధంలో పాల్గొంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
హౌతీల ఆరోపణల ప్రకారం.. యెమెన్ రాజధాని సనా విమానాశ్రయంపై సౌదీ అరేబియా వైమానిక దాడి చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తున్న హౌతీ ప్రతినిధి బృందాన్ని తీసుకొస్తున్న మహాన్ ఎయిర్ విమానాన్ని అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. సౌదీ అరేబియా మాత్రం ఆ విమానం ద్వారా ఇరాన్ ఆయుధాలు లేదా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సిబ్బందిని యెమెన్కు తరలించే ప్రయత్నం జరిగిందనే అనుమానంతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చివరకు ఆ విమానం సనా కాకుండా హౌతీల ఆధీనంలోని హొడైదా విమానాశ్రయంలో దిగింది.
హౌతీల ప్రతీకార దాడులు
సనా విమానాశ్రయంపై దాడికి ప్రతీకారంగా హౌతీలు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ముఖ్యంగా అబ్హా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించారు. అంతేకాకుండా సౌదీ గగనతలాన్ని ఉపయోగించవద్దని అంతర్జాతీయ విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా దెబ్బతిన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
యెమెన్ సంక్షోభం ఎలా మొదలైంది?
2014లో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ఉత్తర ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని దేశం విడిచి వెళ్లేలా చేశారు. అనంతరం సౌదీ నేతృత్వంలోని కూటమి హౌతీలపై సైనిక చర్యలు ప్రారంభించింది. 2022లో ఐరాస మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పరిస్థితి కొంతవరకు సాధారణ స్థితికి చేరుకుంది. అయితే తాజాగా మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
పాకిస్థాన్పై పెరుగుతున్న ఒత్తిడి
సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య గత ఏడాది నాటో తరహా పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారని సమాచారం. ఈ ఒప్పందం పూర్తి వివరాలు బహిరంగం కాకపోయినా.. ఇదే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గతంలో సౌదీతో అణు సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియా పాకిస్థాన్ అణు కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినట్లు కూడా కొందరు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సౌదీలో 8 వేల మంది పాక్ సైనికులు
ప్రస్తుతం పరస్పర రక్షణ ఒప్పందం కింద సౌదీ అరేబియాలో సుమారు 8 వేల మంది పాకిస్థాన్ సైనికులు, 16 యుద్ధ విమానాలు (అధికంగా JF-17లు), చైనా తయారీ వైమానిక రక్షణ వ్యవస్థలు మోహరించి ఉన్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గిన సమయంలో ఈ బలగాలను అక్కడికి పంపించారు. ఒకవైపు సౌదీతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం, మరోవైపు బలూచిస్థాన్ తిరుగుబాట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు, అఫ్గానిస్థాన్ సరిహద్దులో భద్రతా సమస్యలు పాకిస్థాన్ను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. 2015లో యెమెన్ యుద్ధంలో సౌదీ తరఫున సైన్యాన్ని పంపేందుకు పాకిస్థాన్ నిరాకరించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం సౌదీ అరేబియా, హౌతీలు ఒక్కోసారి మాత్రమే పరస్పరం దాడులు చేసుకున్నప్పటికీ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఒకవేళ హౌతీలు సౌదీపై దాడులను మరింత విస్తరిస్తే.. పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీకి సైనిక సహాయం అందించాలంటూ పాకిస్థాన్పై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

